ట్యునిస్ : దారిద్య్రం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పదేళ్ళ క్రితం ఎలుగెత్తిన ట్యునిషీయన్లు ఆనాడు నియంతను తొలగించి విజయం సాధించారు. తిరిగి పదేళ్ళ తర్వాత మళ్ళీ వారు ఆందోళనకు సిద్దమయ్యారు. పదేళ్ళ క్రితం వాగ్దానం చేసిన హామీలేవీ వాస్తవంలో అమలు కాలేదంటూ ట్యునీషియన్లు మరోసారి నిరసనలు చేపట్టారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ''సామాజిక న్యాయం, పని కోసం వీధుల్లోకి వచ్చా''మని కార్మికులు ఎక్కువగా వుండే ఎత్తెదామెన్ ప్రాంతానికి చెందిన చాబిబ్ వ్యాఖ్యానించారు. ట్యునిస్లో, దేశవ్యాప్తంగా మరో 15నగరాల్లో జరిగిన ఆందోళనల్లో చాబిబ్ (34) పాల్గన్నారు. కాగా ఈ ఆందోళనలను ప్రభుత్వం విధ్వంసకాండ, దోపిడీగా చిత్రీకరిస్తోంది. 2011లో ఆనాటి నియంత జీన్ ఎల్ అబిదిన్ బెన్ అలీని పదవీచ్యుతుడిని చేసేందుకు జరిగిన తిరుగుబాటు 10వ వార్షికోత్సవం ముగిసిన రెండు రోజులకే ఈ ఆందోళనలు తలెత్తాయి. ఈ ఆందోళనలు జరుగుతుండగానే కొవిడ్ పేరుతో లాక్డౌన్ను అధికారులు ప్రకటించారు. కాగా ఆందోళననలు, ప్రదర్శనలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని నిరసనకారులు పేర్కొంటున్నారు. రాత్రుళ్లు యువతను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేశారని పౌర సంస్థలు తెలిపాయి. వారిని విడుదల చేయాలంటూ శాంతియుతంగా నిరసనలు కూడా చేస్తున్నారు.