ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పౌర సరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేసే హమాలీలకు(హ్యాండ్లింగ్ కమోడిటీస్) కింద క్వింటాలుకు రూ.3లు కూలీ రేట్లను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు జీఓ ఆర్టి నెంబరు 3ని ప్రభుత్వం విడుదల చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తమకు హమాలీ చార్జీలు పెంచాలని యూనియన్ల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా క్వింటాలుకు రూ.22 నుంచి రూ.25లకు చార్జీలు పెంచినట్లు జీఓలో ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు స్వీపర్స్ చార్జీలు, కుట్టుకూలీ, స్వీట్ ప్యాకెట్, డ్రింకింగ్ వాటర్ ధరలను ప్రభుత్వం పెంచింది. కూలీరేట్లు పెంచడం పట్ల ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ హమాలీల రాష్ట్ర యూనియన్ (సిఐటియు అనుబంధం) గౌరవాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.కృష్ణ, ఎస్.ఉదయ్ లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే అరియర్స్ బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.










