Jul 04,2023 15:12

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రేపు పాఠశాలలు బంద్‌కానున్నాయి. ఈ మేరకు జులై 5న పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల అడ్డగోలు ఫీజుల దందాకు తెరదించేందుకే ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్ల నియామకం చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. బుధవారం (జులై 5) చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.రాష్ట్రంలో పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారంగా మారాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, డొనేషన్‌, కల్చరల్‌ యాక్టివిటీస్‌.. అంటూ రకరకాల ఫీజుల పేర్లతో తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థ ఫీజులు దందాను విద్యాశాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఒకరిద్దరు విద్యార్ధులకు టాప్‌ మార్కులస్తే పెద్ద ప్రకటనలిస్తూ సామాన్యులకు ప్రభుత్వ పాఠశాలలపై అపనమ్మకం కలిగేలా వ్యవహరిస్తున్నాయి.పేరుకు టెస్టులు నిర్వహిస్తున్నామని, ఈ టెస్టుల్లో పాసైతేనే అడ్మిషన్లు ఇస్తామని తల్లిదండ్రులను భయపెడుతున్నారు. కోరుకున్న స్కూల్‌లో సీట్లకోసం ఫీజు ఎంత అడిగినా లెక్కచేయడం లేదు.ఇక కార్పొరేట్‌ స్కూళ్లలోనైతే ఒలంపియాడ్‌, ఏసీ తరగతులు అంటూ ఒక్కో విద్యార్థికి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు వసూలు చేస్తున్నారు. సెమీ రెసిడెన్షియల్‌ అడ్మిషన్లు, రెసిడెన్షియల్‌ అడ్మిషన్ల పేరుతో ఏకంగా రూ.1.80 లక్షల వరకు ఫీజులు రాబట్టుతున్నారు. వీటితో పాటు అదనంగా బస్సు ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు అంటూ బాదుడు. వెరసి పిల్లల్ని చదివించడం పెద్దలకు తలకు మించిన భారంగా మారింది.