Jul 24,2022 07:02

నారాయణన్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా చూపేవారు ఇప్పుడు ద్రౌపది ముర్మును మాత్రం పార్టీలకు అతీతమైన ఆదివాసీ మహిళగానే చిత్రించేందుకు ప్రయత్నించడం వెనక బలమైన రాజకీయ కారణాలున్నాయి. మతతత్వంలో అస్తిత్వ రాజకీయాలను జొప్పించే మోడీ వ్యూహం ప్రతిపక్షాల ఐక్యతను గండిపెట్టిందనీ, బిజెపి ఆధిక్యత సాధించిందని అతిగా ప్రశంసలు గుప్పిస్తున్న వారు వాటిని విస్మరిస్తున్నారు. బిజెపి హయాంలో గతంలో మైనార్టీ ముద్రతో ఎన్నికైన అబ్దుల్‌ కలాం సంఘపరివార్‌ కోరుకునే ఆదర్శ ముస్లిం మాత్రమే గాని మత సామరస్యాన్ని, లౌకికతత్వాన్ని చాటింది లేదు. ఆయన హయాంలోనే గుజరాత్‌ మారణకాండ జరిగినా గట్టిగా స్పందించింది లేదు. మోడీ స్వయానా బిసి అయినా వారికోసం చేసింది లేదు. కనుక ఏ తరగతికి చెందిన వారనేదానితో పాటు ఎవరి తరపున నిలిచారనేది కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ కోణంలో చూసినపుడు ద్రౌపది ముర్ము ఆదివాసిగా పుట్టడం తప్ప వారి హక్కుల కోసం ప్రత్యేకంగా చేసింది పూజ్యం.

పదిహేనవ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును సహజంగానే అన్ని పార్టీల నేతలూ అభినందించారు. ప్రధాని మోడీ, ఎపి ముఖ్యమంత్రి జగన్‌తో సహా బలపర్చిన వారంతా ఆదివాసీ మహిళగా తొలిసారి ఆ పదవిలోకి రావడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. ప్రతిపక్షాల నేతలు ఆమె రాజ్యాంగ విలువలు కాపాడే విధంగా వ్యవహరిస్తారనే ఆశాభావం వెలిబుచ్చుతూ ఆమె కర్తవ్యం గుర్తుచేశారు. స్వాతంత్రం అమృతోత్సవ వేళ మొదటిసారిగా ఆదివాసీ మహిళ అత్యున్నత రాజ్యాంగపదవి చేపట్టడం సామాజిక న్యాయం అని ఎంతగా కీర్తించినా ఆ స్వాతంత్య్రాన్ని సంరక్షించుకునేలా రాజ్యాంగ న్యాయం చేయడం కీలకం. ఉదాహరణకు ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ దళత వర్గానికి చెందిన వారైనప్పటికీ వారికి చేసిన న్యాయం లేదు. రాజ్యాంగ కోణంలోనూ ఒక్కటంటే ఒక్క అంశంలో తన అభిప్రాయం చెప్పిందిగానీ ప్రత్యేక ముద్ర వేసిందీ గాని లేదు. వాస్తవానికి ఆయన దళిత ప్రతినిధిగా కంటే ఆరెస్సెస్‌ పరివార్‌ సభ్యుడుగా తనను తాను నిరూపించుకోవడానికే పాకులాడారు. సుప్రీం కోర్టు చెప్పిన మేరకైనా తన చేతుల్లో వున్న అధికారం వినియోగించుకోలేదు. ఒక్క నిర్ణయాన్నయినా ప్రశ్నించిందీ, తిప్పి పంపిందీ లేదు. ఇదే దళిత వర్గం తరపున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికైన కెఆర్‌ నారాయణన్‌ రాజ్యాంగం యాభయ్యవ వార్షికోత్సవ సందర్భంలో దాని సారాంశం చాటడానికి, అందుకు భిన్నమైన చర్యలు, చట్టాలు నిరాకరించడానికి వెనుకాడలేదు. మెజారిటీ లేని ప్రభుత్వాలను ఆదరాబాదరాగా ప్రమాణస్వీకారం చేయిస్తే, శాసనసభలను రద్దు చేస్తే అభ్యంతరం చెప్పారు. అమెరికా అధ్యక్షుని సమక్షంలో దేశాల సమానత్వాన్ని చాటారు. డా.శంకర్‌ దయాళ్‌ శర్మ బాబ్రీ మసీదు విధ్వంసాన్ని మొదటగా ఖండించి ప్రధానిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచక్షణాధికారం శాసనాలపై సంతకం చేసే ముందు రెండు సార్లు వెనక్కు పంపే అధికారం వున్న రాష్ట్రపతి స్థానంలో ఎవరున్నారనేది చాలా ప్రాధాన్యత గల అంశమే.
 

                                                                       సామాజిక వాదన సారాంశం

నారాయణన్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా చూపేవారు ఇప్పుడు ద్రౌపది ముర్మును మాత్రం పార్టీలకు అతీతమైన ఆదివాసీ మహిళగానే చిత్రించేందుకు ప్రయత్నించడం వెనక బలమైన రాజకీయ కారణాలున్నాయి. మతతత్వంలో అస్తిత్వ రాజకీయాలను జొప్పించే మోడీ వ్యూహం ప్రతిపక్షాల ఐక్యతను గండిపెట్టిందనీ, బిజెపి ఆధిక్యత సాధించిందని అతిగా ప్రశంసలు గుప్పిస్తున్న వారు వాటిని విస్మరిస్తున్నారు. బిజెపి హయాంలో గతంలో మైనార్టీ ముద్రతో ఎన్నికైన అబ్దుల్‌ కలాం సంఘపరివార్‌ కోరుకునే ఆదర్శ ముస్లిం మాత్రమే గాని మత సామరస్యాన్ని, లౌకికతత్వాన్ని చాటింది లేదు. ఆయన హయాంలోనే గుజరాత్‌ మారణకాండ జరిగినా గట్టిగా స్పందించింది లేదు. మోడీ స్వయానా బిసి అయినా వారికోసం చేసింది లేదు. కనుక ఏ తరగతికి చెందిన వారనేదానితో పాటు ఎవరి తరపున నిలిచారనేది కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ కోణంలో చూసినపుడు ద్రౌపది ముర్ము ఆదివాసిగా పుట్టడం తప్ప వారి హక్కుల కోసం ప్రత్యేకంగా చేసింది పూజ్యం. సీనియార్టీలోనూ మోడీ వంటి వారికంటే జూనియర్‌గానే వున్నారు. కనుక రామ్‌నాథ్‌ కోవింద్‌ కన్నా మరింతగా ఆమె సర్కారు గీతల్లో పనిచేస్తారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా సామాజిక కోణంలో ఆమె ఎన్నిక గొప్ప సంచలనంగా చెప్పేవారికివేవీ పట్టవు. వారికి కావలసిందల్లా మోడీకి వత్తాసు పలకడమే.
 

                                                                 ఓటింగులో విశేషాలు, విపరీతాలు

ఓట్ల పరంగా చూస్తే ద్రౌపది ముర్ముకు 6,76,803 ఓట్లు (దాదాపు 66 శాతం) వస్తే ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 ఓట్లు (34 శాతం) వచ్చాయి. దేశంలో మోడీకి తిరుగులేదనే ప్రచారం సాగుతున్న సమయంలో అనేక అవరోధాలు దాటుకుని సిన్హాకు ఇన్ని ఓట్లు రావడం విశేషమే. ఎన్‌డియేతర పార్టీలలో అనేకం ముర్ముకు ఓటు వేసి వుండకపోతే ఈ సంఖ్య మరింత హెచ్చుగా వుండేది. కాని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీ టిడీపి రెండూ ముర్ముకు ఓటేయడంతో మొత్తం ఓట్లు ఆమెకు వచ్చినట్టయింది. ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రలలో ఆమెకు సంఖ్య రీత్యా ఎక్కువ ఓట్లువచ్చాయి. ఎన్‌డిఎలో లేని బిజెడి, శివసేన, జెఎంఎం, బిఎస్‌పి వంటి పార్టీలు పూర్తిగా ముర్ముకే ఓటేశాయి. ఇందులో శివసేన, జెఎంఎం, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు భాగస్వాములు. కాగా ఆ పార్టీకి చెందిన 17 మంది ఎంపిలు, 126 మంది ఎంఎల్‌ఎలు తమ నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమెను బలపర్చారు. త్వరలో ఎన్నికలు జరగాల్సిన గుజరాత్‌ లోనూ పదిమంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు క్రాస్‌ ఓటింగ్‌ చేయడం బిజెపికి మరీ సంతోషం కలిగిస్తుంది. ఇద్దరు టిఎంసి వారూ అటు మొగ్గారు.ఇక చెల్లకుండా పోయిన వాటిలో 15 మంది ఎంపిలు, 38 మంది ఎంఎల్‌ఎలు వున్నారు. ఈ వివరాలన్నీ పరిశీలించినపుడు రాష్ట్రాల స్థాయిలో బిజెపి యేతర పార్టీలకు గట్టి పట్టు వున్నట్టు స్పష్టమవుతుంది. అయితే ప్రాంతీయ పార్టీల నాయకుల ఊగిసలాటలు, అవకాశవాదాల వల్ల అక్కడ కూడా బిజెపి ఓట్లు తెచ్చుకోగలిగింది. కేరళలో మాత్రమే ముర్ముకు అతి తక్కువగా 0.7 శాతం, తెలంగాణలో 2.6 శాతం పడ్డాయి. ఇదే విధంగా పైన చెప్పిన పార్టీలు, రాష్ట్రాలు కూడా నిలబడి వుంటే యశ్వంత్‌ సిన్హాకు మరో లక్షన్నర పైనే ఓట్లు వచ్చేవి. ఉదాహరణకు ఎ.పి నుంచే ఎంఎల్‌ఎలు, ఎంపిల ఓట్ల విలువ మొత్తం 38,250 ద్రౌపది ముర్ముకు వెళ్లాయి. జార్ఖండ్‌లో నైతే పోలింగ్‌ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కుమారుడిని ఈడీ అరెస్టు చేసి లోబర్చుకుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఏకపక్షంగా సమావేశం నిర్వహించి విమర్శల పాలైన బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత మమతా బెనర్జీనే ముర్మునే అభ్యర్థిగా కేంద్రం ముందే సంప్రదింపులు జరిపి వుంటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం వుండేదని ఊగిసలాట ప్రదర్శించారు. బెంగాల్‌లో సంతాల్‌ గిరిజనులు ఎక్కువగా వుంటారు గనక వారి ఓట్ల కోసమే ఆమె ఇలా మాట్లాడారని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
 

                                                              ఉప రాష్ట్రపతి ఎన్నికలో పిల్లిమొగ్గలు

ఇక ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఎన్‌డిఎ తరపున ఎంపిక చేసిన జగదీప్‌ ధంకర్‌ మూర్తీభవించిన పరివార్‌ వాది. ముర్ము విషయంలో సామాజిక న్యాయం చెప్పిన మోడీ ఈ స్థానానికి రాజస్థాన్‌ జాట్‌ నాయకుణ్ని ఎంపిక చేయడంలో ద్వంద్వనీతి చెప్పనవసరం లేదు. పైగా ఆయనను కిసాన్‌పుత్ర అని అభివర్ణించారు. సుదీర్ఘ రైతాంగ ఉద్యమ నేపథ్యంలో దూరమైన జాట్‌లను, సామాన్య రైతు బాహుళ్యాన్ని ఆకట్టుకోవడానికి చేసిన ఎంపిక ఇది. పైగా జగదీప్‌ ధంకర్‌ బెంగాల్‌ గవర్నర్‌గా రాష్ట్ర ప్రభుత్వంతో తగాదాలను పరాకాష్టకు చేర్చారు. ప్రభుత్వానికి తెలియకుండానే ట్విటర్‌ ద్వారా శాసనసభను సమావేశపర్చాలని ఆదేశించిన ఘనత ఆయన స్వంతం. ముఖ్యమంత్రి మమత పాలనపై, దౌర్జన్యాలపై బహిరంగంగా దాడి చేస్తూ బిజెపి తో దాదాపు కుమ్మక్కయ్యారు అయితే మమతా బెనర్జీ కూడా ఏకపక్ష పోకడలు, దాడులు చేసిన దృష్ట్యా ఆయనపై సూత్రరీత్యా పెద్దగా పోరాడలేకపోయింది. అలాటి గవర్నర్‌ను ఉప రాష్ట్రపతిగా మోడీ చేసిన నిర్ణయం వెనక తృణమూల్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ వుందనే ఆరోపణలు బలంగా వున్నాయి. ఈ మేరకు మమత, గవర్నర్‌ ధంకర్‌, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వాస్‌ శర్మ కొంతకాలం కిందట డార్జిలింగ్‌లో సమావేశమయ్యారు. అది మర్యాద పూర్వకమేనని ప్రభుత్వం అంటుంటే ఇవన్నీ చర్చించి ఒప్పందానికి వచ్చారని ఆరోపణలున్నాయి. దానికి తగినట్టే ఉప రాష్ట్రపతి ఎన్నికపై చర్చించడానికి ఏర్పాటైన ప్రతిపక్ష సమావేశానికి టిఎంసి హాజరుకాలేదు. ప్రతిపక్ష అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా నిర్ణయమైనాక తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని, తాము తటస్థంగా వుంటామని ప్రకటించారు. నిజానికి ఆల్వా ఆమెకు మంచి స్నేహితురాలు కూడా. అయినా ఇలా చేస్తున్నారంటే బలమైన కారణాలుండాలి. సోనియా గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి నిర్ణయించిన వారినే బలపర్చాల్సిన అగత్యం మాకు లేదని ఆ పార్టీ చేసిన ప్రకటనలో రాజకీయ కక్ష తొంగిచూస్తున్నది. దేశంలో ప్రతిపక్ష సమీకరణ తానే చేస్తానని హడావుడి పడిన మమత మలి దశలోనే ఇంతగా మారిపోయారంటే ముందు ముందు ఏం జరిగేది చూడాల్సిందే. ఏమైనా ఉప రాష్ట్రపతిని ఎంపిలు మాత్రమే ఎన్నుకుంటారు గనక ఎన్‌డిఎకు స్పష్టమైన ఆధిక్యత వుంటుంది. ఆపైన వైసీపీ, టిడీపీ, బిజెడి వంటి పార్టీలూ వుంటాయి. ఉప రాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా వుంటారు గనక అక్కడ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా గట్టిగా తొక్కిపట్టగలరని కూడా బిజెపి వ్యూహంగా వుంది. తన హయాంలో కాశ్మీర్‌ 370 అధికరణం రద్దు బిల్లు ఆమోదించడం గర్వకారణమని చెప్పుకున్న వెంకయ్య నాయుడును మించి కొత్త ఉప రాష్ట్రపతి మరింత గర్వపడేలా వ్యవహరిస్తారని చెప్పక తప్పదు.
 

                                                          మోడీ ఆయుధాలు, లౌకిక పార్టీల కర్తవ్యం

ఈ పరిణామాలన్నీ చెప్పేదొకటే. మోడీ నాయకత్వం, బిజెపి ప్రాబల్యం తిరుగు లేనివని ప్రచారం చేసుకుంటున్నా రాష్ట్రాలలో బలమైన బిజెపియేతర పార్టీలున్నాయి. అయితే వాటిలో అనేకం మతతత్వ రాజకీయాలను, కేంద్రం నిరంకుశత్వాన్ని గట్టిగా ఎదిరించేందుకు నికరంగా ముందుకు రావడం లేదు. మరికొన్ని మోడీకే వంత పాడుతున్నాయి. ఆర్థిక విధానాల విషయంలోనూ వాటికి అసలే పేచీ లేదు. సమాఖ్య మూలాలపైనే దాడి చేస్తూ వనరులకు ఎసరు పెడుతున్నా నిధులు దిగ్గోస్తున్నా ఆఖరుకు రాష్ట్రాల ఉనికినే చూడనిరాకరిస్తున్నా తాము గెలిస్తేచాలు అన్నట్టుంది వాటి పరిస్థితి. దానికి తోడు సిబిఐ, ఇ.డి, ఎన్‌ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి వారిని లొంగదీసుకోవడం జరుగుతూనే వుంది. కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, టిఆర్‌ఎస్‌, శివసేన, ఆర్‌ఎస్‌పి, డిఎంకె, ఎండిఎంకె, విఎంసి, ఐయుఎంఎల్‌, ఆర్జేడి వంటి పలు పార్టీలు ఈ విషయమై నిరసన తెల్పుతూ ఒక సంయుక్త ప్రకటనే చేశాయి. ఎన్‌సిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూడా ఈ సందర్భంగా సమావేశానికి హాజరయ్యాయి. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీని ఇడి గంటల తరబడి విచారిస్తున్న రోజునే ఈ ప్రకటన వెలువడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇడి, సిబిఐ విచారణ ఎదుర్కోక తప్పదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజరు ఈ సమయంలోనే బెదిరిస్తున్నారంటే ప్రతిపక్షాల హెచ్చరిక ఎంత వాస్తవమో అర్థమవుతుంది.కేరళలోనూ కేంద్రం కుట్రలు తీవ్రంగానే సాగుతున్నాయి. కనకనే సరైన గుణపాఠాలు తీసుకుని రాష్ట్రాల హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం లౌకిక శక్తులు ఒక్క తాటి మీదకు రావాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి.మోడీకి పునాది పీఠం లాంటి గుజరాత్‌్‌, దేశానికే కీలకమైన జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ రాష్ట్రాలలో గిరిజన జనాభా కూడా గణనీయంగా వుంది. చాలాకాలంగా ఆరెస్సెస్‌ వనవాసి కళ్యాణ పరిషత్‌ వంటి సంస్థల ద్వారా గిరిజనుల్లో చొరబడే ప్రయత్నం చేస్తూనే వుంది. వారిలో క్రైస్తవీకరణ గురించి రభస చేయడమే గాక గ్రాహం స్టెయిన్స్‌ వంటి వారి హత్యలు కూడా జరిగాయి. గుజరాత్‌ లోని డాంగ్స్‌ అడవులలో మొదలుపెట్టిన ఈ వ్యూహం ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలోనూ పాచికైంది. వాస్తవంగా గిరిజనుల అటవీ హక్కుల చట్టం, అడవులలో అపార ఖనిజ సంపద కార్పొరేట్ల పరం చేయడం, పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడం, వారి సంక్షేమ పథకాలను కోత కోయడం జరిగిపోతూనే వుంది. దేశంలో 8.7 శాతంగా వున్న ఈ అభాగ్యుల హక్కుల రక్షణ కోసం జరగాల్సిన పోరాటం చాలా వుంది. మరి మోడీ సామాజిక న్యాయ వ్యూహం వాటన్నిటిని మటుమాయం చేయడం జరిగే పని కాదు. పదవులకు కొందరు ఎన్నికైతే పరిస్థితులు మారిపోవు.


తెలకపల్లి రవి

తెలకపల్లి రవి