Feb 03,2023 21:35

9నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ
తొలి టెస్టుకు నాగపూర్‌ సిద్ధం

ముంబయి: బోర్డర్‌ాగవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా 9నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరిగే తొలిటెస్ట్‌కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. గాయంతో కొంతకాలం టీమిండియా జట్టుకు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా శుక్రవారం ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్‌ ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను బిసిసిఐ శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20, వన్డే సిరీస్‌లను చేజిక్కించుకున్న టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతోపాటు, రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌ తదితరులు నెట్స్‌లో సాధన చేస్తూ కనిపించారు. ఆస్ట్రేలియాతో 4టెస్టుల సిరీస్‌ ఈ నెల 9న ప్రారంభం కానుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు బెంగళూరులోని ఆలూర్‌ క్రికెట్‌ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తోంది. ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆసీస్‌ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండు అగ్రశ్రేణి జట్లు తలపడుతున్న సిరీస్‌ కావడంతో అందరి దృష్టి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీపైనే ఉంది.