
హైదరాబాద్ : ప్రపంచంలోనే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ప్రశంసనీయమే.. కానీ ప్రస్తుత స్థాయిల నుంచి దేశ ప్రజల తలసరి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందని ఆర్బిఐ మాజీ గవర్నర్, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ ఛైర్మన్ సి రంగరాజన్ అన్నారు. శనివారం ఇక్ఫాయి 13వ స్నాతకోత్సవం సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత భవిష్యత్తు అభివృద్ధికి స్పష్టమైన రోడ్మ్యాప్ రూపొందించుకోవడం ద్వారానే వృద్ధి రేటును పెంచుకోగలమన్నారు. 2020లో తలసరి ఆదాయానికి సంబంధించి భారత ర్యాంకు 197 దేశాల్లో 142వ స్థానంలో ఉందన్నారు. ఇది మనం ప్రయాణించాల్సిన దూరాన్ని చూపుతుందన్నారు. ఇప్పుడున్న తలసరి ఆదాయ స్థాయిని బట్టి చూస్తే వేగంగా వృద్ధి చెందడం తప్పా మనకు వేరే మార్గం లేదన్నారు. దేశం రాబోయే రెండు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నిరంతరం ఏడు శాతం వృద్ధి రేటును నమోదు చేయడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పును సాధించగలమన్నారు. అప్పుడే భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ స్థితికి చేరొచ్చన్నారు. ఇందుకోసం నూతన సాంకేతికతలను గ్రహించడంతో పాటుగా నైపుణ్యం కలిగిన మానవశక్తి అవసరం ఉందన్నారు. వృద్ధితోపాటు ఉపాధి పెరగాలన్నారు. అదే విధంగా వృద్ధి లేకుంటే ఉపాధి పెంపుదల నిలకడగా ఉండదన్నారు. అందుకే కనీసం 7 శాతం స్థిరమైన వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకోవాలని రంగరాజన్ అన్నారు. దేశం బలమైన ఎగుమతులతో పాటుగా పటిష్టమైన తయారీ రంగం సహా బహుళ అభివృద్ధి వ్యూహంతోనే భారత్ పురోగమించగలదని అభిప్రాయపడ్డారు. ఈ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ఎం జగదీష్ కుమార్ హాజరయ్యారు.