ప్రజాశక్తి- అమరావతి : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులపై ఒక రోజు సస్పెన్షన్ వేటు పడింది. సభలో నుంచి సస్పెండ్ అయినవారిలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగపూడి రామకష్ణ, మంతెన రామరాజు, సాంబశివరావు, గద్దె రామ్మెహన్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రమికుమార్లు ఉన్నారు.

- సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలి.. టీడీపీ నిరసన
- అయిదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
అయిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలను బహిర్గతం చేయాలని టిడిపి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎం జగన్కు ఢిల్లీ గుర్తుకొస్తుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన మండిపడ్డారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వాయిదా తీర్మానానికి అర్థం తెలుసా? అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏం జరిగిందో అందరికి తెలుసునని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనల గురించి చర్చించాలంటే.. గతంలో 30 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అవి చర్చకు పెడదామా? అని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులపై ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించారని అన్నారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులు, పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా అని ప్రశ్నించారు.










