వాషింగ్టన్ : ట్విట్టర్కు రోజుకు 4 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.33 కోట్లు) నష్టం జరుగుతుందని ఆ కంపెనీ సిఇఒ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని ఆయన సమర్థించుకున్నారు. సిబ్బంది తగ్గింపు మినహా మరో అవకాశం కన్పించలేదన్నారు. తొలగించిన ప్రతి ఉద్యోగికి మూడు నెలల వేతన చెల్లింపులు చేస్తున్నామన్నారు. చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇది 50 శాతం ఎక్కువేనన్నారు. ట్విట్టర్ ఇప్పటికే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో 7500 వరకు ఉద్యోగులుండగా.. 3700 పైగా మందిని తొలగించినట్లు రిపోర్టులు వస్తున్నాయి.
విషం చిమ్మే ట్విట్టర్ : జో బైడెన్
తప్పుడు సమాచారాన్ని అవాస్తలను వ్యాప్తి చేస్తున్న ట్విటర్ను కొనుగోలు చేశారంటూ ఎలన్ మస్క్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా, అసత్య ప్రచారాలతో ట్విట్టర్ విషాన్ని చిమ్ముతుందన్నారు. ఇలాంటి సంస్థలను మస్క్ స్వాధీనం చేసుకోవడం విచారకరమన్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సిఇఒ, సిఎఫ్ఒలను తొలగించి.. ప్రస్తుతం మాస్క్ ఒక్కడే కీలకంగా ఉండటంపై బైడెన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది వరకు బైడెన్కు వ్యతిరేకంగా మస్క్ మాట్లాడిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు.










