Aug 18,2023 22:02

బెంగళూరు: దేశంలోనే తొలి 'త్రీడీ ప్రింటెడ్‌' పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మించిన ఈ తపాలా కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నిర్మాణ పనులు సాగిన తీరు, కార్యాలయంలోని సౌకర్యాలను చూపుతోన్న ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేశారు. 'ఆత్మనిర్భర్‌ భారత్‌' స్ఫూర్తికి ఈ 'త్రీడీ పోస్టాఫీస్‌' నిదర్శమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'త్రీడీ పోస్టాఫీసు'పై స్పందిస్తూ.. ప్రతి భారతీయుడు దీన్ని చూసి గర్వపడతారని పేర్కొన్నారు. స్వావలంబన స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోందని ట్వీట్‌ చేశారు. ఇక్కడి కేంబ్రిడ్జ్‌ లేఅవుట్‌లో 1021 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని నిర్మాణం చేపట్టారు. ఆధునిక 'త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ' సాయంతో కేవలం 45 రోజుల వ్యవధిలోనే పనులు పూర్తి చేయడం విశేషం. అదే సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే దాదాపు ఎనిమిది నెలలు పడుతుందని అధికారులు చెప్పారు. మద్రాస్‌ ఐఐటి సాంకేతిక సహకారంతో ఎల్‌టి సంస్థ దీన్ని నిర్మించినట్లు తెలిపారు.