హైదరాబాద్ : సాగరతీరాన నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా రేసు విజయవంతంగా ముగిసింది. భారత్లో తొలిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రేసింగ్లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లారు. ఆఖరి ల్యాప్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ రేసులో జీన్ ఎరిక్ వెర్గ్నే విజయం సాధించాడు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. ఈ రేసులో 11 టీమ్లు 22 మంది డ్రైవర్లు పాల్గొనగా విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్నే నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ(ఎన్విజన్ రేసింగ్), మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి(ఎన్విజన్ రేసింగ్) ఉన్నారు. ఈ రేసు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు.










