Nov 07,2022 20:56
  • భారత్‌లో 90% సిబ్బంది తొలగింపు

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ఎలన్‌ మస్క్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్‌లో 90 శాతం ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా తన ఉద్యోగుల్లో సగం వరకు సిబ్బందికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. కాగా.. భారత్‌లో ఈ సంఖ్య భారీగా ఉండటం గమనార్హం. దేశంలో మొత్తంగా 200 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇందులో తొలగింపుల తర్వాత డజన్‌ మంది మాత్రమే మిగిలారని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఆ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు 7500 వరకు ఉద్యోగులుండగా.. 3700 పైగా మందిని వారాంతంలో తొలగించింది. భారత్‌లోనూ 180 మంది వరకు ఉద్వాసన పలికింది. దేశంలో సేల్స్‌ నుంచి మార్కెటింగ్‌ వరకు, కంటెంట్‌ క్యూరేషన్‌ నుంచి కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ల విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులను ఇంటికి పంపించింది. గ్లోబల్‌గా ఉద్యోగుల తొలగింపులో పలువురి అవసరం ఉన్నప్పటికీ.. ముందస్తు అంచనా వేయకుండా వారికి పింక్‌ స్లిప్‌లు జారీ చేసింది. అందులో కొందరినీ తిరిగి తీసుకోవడానికి సమాచారం ఇస్తుందని సమాచారం.