Jul 04,2022 20:52

12వేల ఉద్యోగులకు ఉద్వాసన
ప్రమాదంలో మరో 50 వేల మంది
న్యూఢిల్లీ  : 
దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనానికి తోడు అధిక ద్రవ్యోల్బణం స్టార్టప్‌లకు గండంగా మారాయి. వీటికి తోడు నిధుల కొరత, ప్రభుత్వ మద్దతు కరవు పరిణామాలతో అనేక స్టార్టప్‌లు మూత పడటం లేదా ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. దీంతో ప్రస్తుత ఏడాదిలో 60వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయని ఐఎఎన్‌ఎస్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఓలా, బ్లింకిట్‌, వేదాంతు, కార్స్‌ 24, లిడో లెర్నింగ్‌ ఫర్లాంకో వంటి స్టార్టప్‌లలో పనిచేస్తున్న వారిలో ఇప్పటికే 12వేల మందిని ఆయా సంస్థలు తొలగించాయి. మరిన్ని స్టార్టప్‌లు పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఏడాదిలో మరో 50వేల ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉన్నాయని అంచనా. అనేక స్టార్టప్‌లు నష్టాలతో ఎదురీదుతున్నాయి. కొన్ని సంస్థలు మూత పడుతుండగా.. మరికొన్ని సంస్థలు కష్టాల కడలిలోనూ గట్టెక్కె ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక భారం తగ్గించుకునే యత్నంలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. నమ్ముకున్న సంస్థలు అర్థంతరంగా మూత పడటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. వరుస నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భారీగా తగ్గిపోయి ప్రయివేటు సంస్థలే దిక్కు అనే పరిస్థితులు నెలకొనగా.. స్టార్టప్‌లు సైతం చేతులు ఎత్తేడయంతో నిరుద్యోగ సమస్య మరింత పెనుభూతంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.