Nov 07,2022 20:58

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పిఎస్‌బి)లు మెరుగైన ఆర్థిక ఫలితాలు నమోదు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 12 పిఎస్‌బిల నికర లాభాలు 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లకు చేరాయన్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థం (6 మాసాల్లో)లో 32 శాతం వృద్థితో రూ.40,991 కోట్ల నికర లాభాలు సాధించాయన్నారు. పలు చర్యల వల్ల పిఎస్‌బిలు మొండి బాకీలు తగ్గుతున్నాయన్నారు. గడిచిన క్యూ2లో ఎస్‌బిఐ రికార్డ్‌ స్థాయిలో రూ.13,265 కోట్ల లాభాలు సాధించిందని మంత్రి గుర్తు చేశారు. కెనరా బ్యాంకు లాభాలు 89 శాతం పెరిగి రూ.2,525 కోట్లకు చేరగా.. యూకో బ్యాంక్‌ లాభం ఏకంగా 145 శాతం వృద్థితో రూ.504 కోట్లకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం 58.70 శాతం పెరిగి రూ.3,312 కోట్లకు చేరినట్లు గుర్తు చేశారు. పిఎస్‌బిల్లో పిఎన్‌బి, బిఒఐ మాత్రమే లాభాల్లో తగ్గుదలను చవి చూశాయన్నారు. మిగితా 10 విత్త సంస్థలు 13-145 శాతం వరకు పెరుగుదలను సాధించాయన్నారు.