
రాయచోటి టౌన్ : ప్రభుత్వం యానిమేటర్లకు మూడేళ్ల వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యలర్ 64ను వెంటనే రద్దు చేయాలని యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రాణెమ్మ జి.రెడ్డెప్ప డిమాండ్ చేశారు. యానిమేటర్ల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 36 గంటల దీక్షలు మొదటి రోజు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న యానిమేటర్లు రాత్రి కలెక్టరేట్ వద్దనే నిద్రపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతికి తోడ్పడే 28 వేల మంది యానిమేటర్ల కుటుంబాలు ప్రభుత్వ అనాలోచనతో విడుదల చేసిన 64వ సర్క్యులర్తో రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించుకొని మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమ్మ, కోశాధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే రూ.8 వేల జీతంలో ప్రభుత్వ యాప్లకు, రవాణా ఖర్చులకు 3వేలు ఖర్చు పోగా, కేవలం రూ.5 వేలతో కుటుంబాలు నెగ్గుకు రావాలంటే చాలా ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. జీతాలు రాక, చేసిన అప్పులతో వ్యధకు గురై పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, పెరిగిన ధరలతో తీవ్ర ఇక్కట్లతో మానసిక ఆందోళనల నుండి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి.పి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల భద్రత గౌరవం ఇవ్వక పోవడం దారుణమన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.చంద్రశేఖర్, ఎ.రామాంజులు మాట్లాడుతూ ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, సిబిఒహెచ్ఆర్ అమలు చేసి, సంఘాల మెర్జింగ్ ఆపాలని, రూ.పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్ర వ్యాపితంగా నిరవధిక సమ్మె కైనా సిద్ధమవుతామని హెచ్చరించారు. జిల్లాలో గ్రూపులు తక్కువ ఉన్నాయనే నెపంతో విధుల నుండి తప్పించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ సంఘాల ప్రతినిధులు భాగ్యలక్ష్మి, బంగారుపాప, ఖిజాబి, ముంతాజ్, సురేంద్ర పాల్గొని యానిమేటర్ల ముఖ్యమైన డిమాండ్ల సాధన పోరాటానికి తమ సంఘీభావం తెలిపారు. అనంతరం వంటా వార్పులో భాగంగా కలెక్టరేట్ వద్ద భోజనం వండుకుని తిన్నారు. రాత్రి కూడా అక్కడే పడుకుంటామన్నారు. కార్యక్రమంలో యానిమేటర్లు పవన్, రెడ్డెప్పరెడ్డి, రమణారెడ్డి, ప్రశాంతి, రామంజులమ్మ, కన్యాకుమారి, చెన్నమ్మ, ప్రసన్న, పెద్దఎత్తున యానిమేటర్లు పాల్గొన్నారు.