
అమరావతి : కరోనా ప్రభావంతో కొన్నాళ్లు రైల్వే సేవలు నిలిచాయి. నిదానంగా తిరిగి రైల్వే సేవలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రైళ్లలో ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు ప్రారంభం కానున్నాయని భారతీయ రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. కరోనా లాక్డౌన్ తర్వాత దశల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా.. ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆంక్షలను సడలిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. రైళ్లలో ఈ-కేటరింగ్ సేవలను మళ్లీ ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమయింది. ఈ సేవల వల్ల రైల్వే ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తమ బెర్తు వద్దకే తెప్పించుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ వెబ్సైట్ https://www.ecatering.irctc.co.in లేదా 1323 నెంబర్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ యాప్ అయిన Food on Track యాప్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు దేశ వ్యాప్తంగా మొత్తం ఒకేసారి ప్రారంభించకుండా దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ముందుగా 30 రైల్వే స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించి 250 రైళ్లకు మాత్రమే కేటరింగ్ సేవలను రైల్వే శాఖ అందించనుంది. తర్వాత దశలవారీగా దేశ వ్యాప్తంగా కేటరింగ్ సేవలను ప్రారంభించనుంది.