జార్ఖండ్ జెసూట్ ఫాదర్, ఆదివాసుల అభ్యున్నతికి అంకితమైన హక్కుల కార్యకర్త, స్టాన్స్వామి నిర్బంధం లోనే ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేస్తున్నది. 82 ఏళ్ల ఈ వయోవృద్ధ సంఘ సేవకుడు గత అక్టోబర్ 8న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఎ) బీమా కోరెగావ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి అనేక బాధలు పడుతూనే బెయిలు కోసం పోరాడుతూ వచ్చారు. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుడైన స్టాన్స్వామికి కరోనా కూడా సోకింది. ఎట్టకేలకు మే 28న ముంబాయి హైకోర్టు ఆయన బెయిల్ పిటిషిన్ను స్వీకరించింది. కాని బెయిల్ మంజూరు చేయకుండా చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించాల్సిందిగా మాత్రమే ఆదేశాలిచ్చింది. దానికి ఆయన అంగీకరించలేదు. తన నిర్బంధం రాజ్యాంగం 14, 21 అధికరణాల ప్రకారం అక్రమం గనక బెయిల్ కోరుతున్నానని అన్నారు. 'నా శరీరం రోగగ్రస్త శరీరం. మందుల ప్రభావం కంటే వేగంగా క్షీణిస్తున్నది. నేనెలాగూ ఈ లోగానే చనిపోతాను. కనుక వేరే చికిత్స నిష్ప్రయోజనం' అన్నారు. అయినా మిత్రుల ఒత్తిడిపై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ అక్కడే మరణించారు. విచారణలో వున్న ఖైదీలు (అండర్ ట్రయల్స్) కోసం జీవితమంతా పోరాడిన స్టాన్స్వామి తానూ ఆ విధంగానే మరణించడం ఒక మహా విషాదం. మన వ్యవస్థ నిజ స్వరూపానికి నిదర్శనం. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కర్కోటక స్వభావానికి, దాన్ని ఉపయోగించే పాలకుల దమననీతికీ మన న్యాయ వ్యవస్థ స్పందనా రాహిత్యానికి కూడా స్టాన్స్వామి ప్రాణ బలి ప్రత్యక్ష ఉదాహరణ.
తమిళనాడు లోని తిరుచిరాపల్లిలో జన్మించిన స్టాన్స్వామి పూర్తి పేరు స్టాన్స్లస్ లౌద్రాస్వామి. ఆయన 1965లో జార్ఖండ్ వచ్చారు. అప్పటికి అది బీహార్లో భాగంగా ఉండేది. ఫాదర్గా శిక్షణ పొందడంలో భాగంగా ఆయనను పశ్చిమ సింగ్భూం జిల్లాలోని చైబ్సాలో ఒక మిషనరీ పాఠశాలకు టీచర్గా, హాస్టల్ బాధ్యుడుగా పంపించారు. చైబ్సాలో సంత మార్కెట్కు వెళ్లే క్రమంలో స్టాన్స్వామి దళారులు, పెత్తందారులు అమాయకులైన ఆదివాసులను ఎలా కొల్లగొడుతున్నారో ప్రత్యక్షంగా చూశారు. 1967లో ఫిలిప్పైన్స్లో మతపరమైన అధ్యయనం, శిక్షణ కోసం వెళ్లినప్పుడే ఆయన ప్రపంచంలో మూలవాసుల జీవన పరిస్థితుల గురించి, బాధల గురించి తెలుసుకున్నారు. 1971లో తిరిగి వచ్చాక జెంషడ్పూర్ జెస్సూట్లలో చేరారు. బాగా లోతట్టున వుండే 'హో' అనే ఆదివాసీ తెగ గ్రామంలో నివాసం ఏర్పరుచుకున్న స్టాన్స్వామి వారి భాషనూ ఆచారాలను కూడా అర్థం చేసుకునేంతగా కలసిపోయారు. క్రమేణా ఇతర గిరిజన భాషలూ, హిందీ కూడా నేర్చుకున్నారు. ఆ విధంగా వారితో వారి భాషలోనే మాట్లాడాలన్నది ఆయన సంకల్పం. 1975 నుంచి 1990 వరకూ బెంగుళూరు లోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్లో గడిపినా జార్ఖండ్లో ఆదివాసులతో ఆయన సంబంధాలు కొనసాగించారు. 1991లో తిరిగి వచ్చాక పూర్తిగా ఆదివాసుల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం అంకితమైనారు. 'హో' తెగలో వుండే ముండమంక్ స్వయం పాలన వ్యవస్థ కోసం పని చేశారు. పాలమూ గుమ్లా జిల్లాలలో కాల్పుల శిక్షణ కేంద్రం కోసం, రాంచి పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో కోయెల్ కరో డ్యామ్ కోసం ఆదివాసులను నిర్వాసితులను చేయడంపై నిరసన పోరాటం నడిపారు. 2001లో రాంచీ వచ్చిన స్టాన్స్వామికి జెసూట్ సంస్థ ఒక ఎకరా భూమిని కేటాయించింది. ఆదివాసుల అభ్యున్నతి కోసం హక్కుల కోసం రాంచి శివార్లలోని నమ్కుమ్లో 'బిసైచా' అనే సంస్థ స్థాపించి పని చేస్తూ పరిశోధనలు చేయిస్తూ వచ్చారు. 'భూములు లాక్కోవడం, అభివృద్ధి పేరుతో గనులు, ప్రాజెక్టుల టౌన్షిప్ల కోసం ఆదివాసుల ఆమోదం లేకుండానే సామూహికంగా వెళ్లగొట్టడం ఈ రెండు అంశాలపై మా కేంద్రీకరణ వుంటుంది, అలాంటివారే ఎప్పుడూ బలవుతుంటారు. అలాంటి ఎస్టి, ఎస్సి ప్రజలతో మరీ ముఖ్యంగా యువతతో కలసి పనిచేయడం వారి సమస్యలకు శాస్త్రీయమైన కారణాలు తెలియజేయడంకోసం కృషి చేస్తాము. ఈ సమస్యపై ఎలాంటి ప్రజా ఉద్యమాలు సాగించాలి? సంస్థలు నిర్మించాలి? ఏ వ్యూహాలు అనుసరించాలన్నదే అధ్యయనం చేస్తూ వుంటాము. 2014-15లో మోడీ అధికారంలోకి వచ్చాక ఎందరో యువతను ఇష్టానుసారం అరెస్టు చేసి తీసుకెళ్లడం, అన్యాయంగా తమను తొలగించవద్దంటూ ఎలుగెత్తిన వారెవరినైనా జైలుపాలు చేయడం పెరిగింది. గిరిజనులు ఆదివాసులు అధికంగా వుండే రాష్ట్రాలన్నిటా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్ పశ్చిమ ప్రాంతం ప్రతి చోటా ఇలాగే జరిగింది. దీన్ని మౌనంగా సహించకూడదని నేను నిర్ణయానికి వచ్చాను' అని స్టాన్స్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ క్రమంలోనే బాధిత ఖైదీల సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసి చాలా మంది లాయర్లను ఒకచోట చేర్చారు. అండర్ ట్రయల్స్ పట్ల అమానుష ప్రవర్తనను స్టాన్స్వామి గట్టిగా ఎదుర్కొనేవారు. వారి కోసం లాయర్లను పెట్టి పోరాడేవారు. ప్రజాప్రయోజన వాజ్యాలు వేయించేవారు. 1996 పీసా చట్టం, 2006 అటవీ హక్కుల సంరక్షణ చట్టం, 2013 భూసేకరణ చట్టం వంటి వాటిలో వుండే హక్కులను సాధించుకోవడంపైనా ఆయన దృష్టి సారించేవారు. మావోయిస్టు అనుకూలమైనదిగా పేరున్న 'విస్తాపన్ విరోధి జనవికాస్ ఆందోళన్ సమితి'తో దీనికి సంబంధాలున్నాయని ఆయన వారి సానుభూతిపరుడని పోలీసులు ఆరోపిస్తూ వచ్చారు. ఎక్కడ వారిని అరెస్టు చేసినా, ఎన్కౌంటర్లు జరిగినా ఆయన ఖండించేవారని విమర్శించేవారు. వాస్తవంలో మావోయిస్టులతో సంబంధం లేని ఎంతోమందిని పోలీసులు నిర్బంధించి హింసిస్తున్నారని 'బిసైచా' పరిశోధనలో తేల్చింది. 2015లో జార్ఖండ్ లోని 18 జిల్లాలలోనూ 102 మందిని నిర్బంధం లోకి తీసుకుంటే వీరిలో ఇద్దరే నిజంగా సంబంధాలు కలిగినవారని పేర్కొంది. వీరిలోనూ అత్యధికులు ఎస్సి, ఎస్టి లే. కాని ఎన్ఐఎ మాత్రం ఆయన మావోయిస్టు సానుభూతిపరుడని ఆరోపించింది. 2017 డిసెంబర్ 3న పూనేలో ఆయన ఒక రెచ్చగొట్టే ప్రసంగం చేశారనీ, ఆ కారణంగానే బీమ కోరెగావ్ ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో హింస చెలరేగి ఒకరు మరణించారని వారు కేసు పెట్టారు. తర్వాత కొంత కాలానికి ఇదే బృందం ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారని అరోపించింది. వాస్తవంలో మాల్వేర్ సహాయంతో కంప్యూటర్లో బూటకపు సాక్ష్యాలు సృష్టించారని 'వాషింగ్టన్ పోస్ట్' వంటి పత్రికలే రాశాయి. ఏమైనా సుధా భరద్వాజ్, వరవరరావుతో సహా ఎందరినో దీనికి సంబంధించి ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టు చేశారు. ఆదివాసులు, అండర్ ట్రయల్స్ కోసం స్టాన్స్వామి నెలకొల్పిన 'బిసైచా' సంస్థ ప్రాంగణం నుంచే ఆయనను 2020 అక్టోబరులో అరెస్టు చేసింది. కిక్కిరిసి వుండే తలోజా జైలు నుంచి మరో చోటకు మార్చాలని ఆయన మిత్రులు ప్రభుత్వాన్ని, కోర్టులను కోరుతూనే వచ్చారు. సర్కార్లు, దర్యాప్తు సంస్థలు ఆ పని చేయకపోగా ఆ వయోవృద్ధుడికి అవసరమైన కనీస పరికరాలను కూడా ఖైదులో అందించకుండా వేధించారు. పార్కిన్సన్ వల్ల చేతులు స్వాధీనంలో వుండని స్వామి మంచి నీళ్లు తాగడానికి స్ట్రా వాడుకోవడానికి, విసర్జన పరికరాలకు కూడా కోర్టు అనుమతి కోరవలసి వచ్చింది. స్టాన్స్వామిని విడుదల చేయాలని, చికిత్స సదుపాయాలు కలిగించాలని ప్రముఖ మేధావులు సంయుక్త ప్రకటన చేసినా పాలకులు గాని, న్యాయస్థానాలు గాని పరిగణనలోకి తీసుకోలేదు. 'ఉపా' చట్టం కింద బెయిలుకు అవకాశం లేదని ఈయన బయిటకు వస్తే ప్రమాదమని ఎన్ఐఎ వాదించింది. ఇదే కేసులో అరెస్టు అయిన ఇతరుల పరిస్థితి కూడా ఇంతే అధ్వాన్నంగా అమానుషంగా వుంది.
గత బుధవారం బాంబే హైకోర్టులో జస్టిస్ షిండే, జమాదార్ల ధర్మాసనం ఆయన పిటిషన్ తీసుకోగానే తన తరపు న్యాయవాది మిహిర్ దేశారు మాట్లాడుతూ 'స్టాన్స్వామికి చికిత్స చేసిన డా||డిసౌజా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు' అని తెలిపారు. తర్వాత డిసౌజా కోర్టు ముందుకు వచ్చి శనివారం సాయంత్రం 4.30కు గుండెపోటుకు గురైన స్టాన్స్వామికి ఎంత చికిత్స చేసినా ఈ రోజు మధ్యాహ్నం మరణించారని చెప్పారు. దానిపై ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. మొదటిసారిగా తామే ఆయనను ఆస్పత్రికి తరలించాలని ఆదేశించామని అయితే ఆయన మరణించారు గనక ఇక ఈ పిటిషన్ తీసుకోవడంలేదని ప్రకటించింది. న్యాయవాది మిహిర్ దేశాయి మాట్లాడుతూ తమకు చికిత్సపై ఎలాంటి సందేహం లేకున్నా ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని కోరారు. ఇదే కోర్కె దేశంలోని ప్రతిపక్షాల నుంచీ మేధావులు, హక్కుల కార్యకర్తల నుంచి మాత్రమే గాక ప్రపంచ దేశాల నుంచి కూడా వినవచ్చింది. వీటన్నిటితో అనివార్యంగా విదేశాంగ శాఖ ఒక వివరణ జారీ చేయవలసి వచ్చింది. స్టాన్స్వామిని చట్టబద్దంగానే అరెస్టు చేశామనీ, ఆయనకు బెయిలు నిరాకరించింది కోర్టులేనని సమర్ధించుకుంది. కాని ఇదంతా కంటితుడుపు మాత్రమే. జార్ఖండ్ బిజెపి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు దీపక్ ప్రకాశ్ ఒక ప్రకటన చేస్తూ... స్టాన్స్వామికి ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మద్దతునిచ్చారని, ఆయన అరెస్టును ఖండించారని విమర్శించారు. బిజెపి ఆరెస్సెస్ వాదులు సోషల్ మీడియా లోనూ ఈ తరహా విద్వేష వ్యాఖ్యలు కురిపించారు. కోర్టులో ఎన్ఐఎ ఇప్పటికీ సమర్థనగానే వాదిస్తున్నది, అంటే ప్రపంచవ్యాపిత నిరసన, దేశ ప్రజల ఆగ్రహం ఇంతగా ప్రజ్వరిల్లినా పాలకుల కళ్లు తెరవలేదన్నమాట. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన పతిపక్షాలు రాష్ట్రపతి కోవింద్కు ఒక మెమోరాండం కూడా సమర్పిస్తూ విచారణ జరిపించాలని కోరాయి. ఏది ఏమైనా 'స్టాన్స్వామిది ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా చేసిన హత్య. న్యాయ వ్యవస్థ చేసిన హత్య' అనే విమర్శ మన సమాజానికే ఒక హెచ్చరిక. హక్కుల కోసం జరగాల్సిన పోరాటానికి పిలుపు. నిరంకుశ శాసనాలను తొలగించేవరకూ ఆ పోరాటం సాగవలసిందే.
వ్యాసకర్త - పీ పీ










