
లక్నో : యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయి. తాజాగా సీతాపూర్లో హిందూ కుటుంబానికి చెందిన యువతిని కిడ్నాప్ చేశాడంటూ ముస్లిం దంపతులను కర్రలతో కొట్టి చంపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడిలో అబ్బాస్ , అతని భార్య కమ్రుల్ నిషా అక్కడికక్కడే మృతి చెందినట్లు సీతాపూర్ పోలీస్ సూపరిండెంట్ చక్రేష్ మిశ్రా తెలిపారు. నిందితులు పరారయ్యారని అన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
వివరాల ప్రకారం.. అబ్బాస్ కుమారుడు షౌకత్, రాంపాల్ కుమార్తె రూబీలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. 2020లో రూబీని షౌకత్ అపహరించాడు. ఆ సమయంలో రూబీ మైనర్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం షౌకత్ను జైలుకు తరలించారు. ఇటీవల షౌకత్ జైలు నుండి విడుదలయ్యాడు. ఈ ఏడాది జూన్లో మరోసారి రూబీని అపహరించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రాంపాల్ కుటుంబం అబ్బాస్, కమ్రుల్ నిషాలపై దాడికి దిగింది. ముగ్గురిని అతుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.