Nov 19,2023 21:03

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు

మహాధర్నాను జయప్రదం చేయండి
- ఎపి రైతు సంఘం
ప్రజాశక్తి - బేతంచెర్ల

    ఈ నెల 27, 28వ తేదీలలో విజయవాడ నగరంలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని ఏపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.సుబ్బరాయుడు, మండల కార్యదర్శి రామ్మోహన్‌ కోరారు. ఆదివారం బేతంచెర్లలోనిప్రజాసంఘాల కార్యాలయంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు సీతారామపురం జి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన రైతు సంఘం మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలన్నింటికీ సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి ఎంఎస్‌పిలను నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని, రైతులు, పేదల పాలిట ఉరితాడు కాగల ఎలక్ట్రిసిటీ బిల్లును ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించరాదని తెలిపారు. కౌలు రైతులతో సహా రైతులందరికీ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు అందించాలన్నారు. రైతు పంట రుణాల బకాయిలను ఒక పర్యాయం రద్దు చేయాలని చెప్పారు. రైతు రుణ ఉపశమన చట్టంను పార్లమెంటులో ఆమోదించి చేసి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ అనుకూల ప్రధాన మంత్రి పంటల బీమా పథకాన్ని ఉపసంహరణ, ధరల పెరుగుదలను నియంత్రించి ఆహారం, మందులు, వ్యవసాయ ఉపకరణాలు, నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గించాలన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్‌పై సెంట్రల్‌ ఎక్స్చేంజ్‌ డ్యూటీ తగ్గించాలన్నారు. బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె చెరువును హంద్రీనీవా నీటితో నింపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు రంగాపురం కిష్టన్న, చాకలి ఎల్లాకృష్ణ, పుల్లెం అనిల్‌, మా బాష, భీమలింగడు, వి.వీరేష్‌, వెంకట సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.