Nov 21,2023 21:55

సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి - లక్కవరపుకోట :   రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోయినా కేంద్రాన్ని అడగని జగన్‌కు ఎందుకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని టిడిపి నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజక వర్గం ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో లక్కవరపుకోటలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒకటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పేద వాడికి అన్నం పెడుతున్నో అన్నా క్యాంటీన్‌ను రద్దు చేసిన దుర్మార్గుడని విమర్శించారు. రాష్ట్రం కోసం 18 సార్లు ఢిల్లీ వెళ్లినా విభజన హామీల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయారని అన్నారు. చివరికి విశాఖ రైల్వేజోన్‌ను కూడా సాధించలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో 78శాతం పూర్తి చేస్తే, జగన్‌ వచ్చిన తరువాత కనీసం 2శాతం కూడా పూర్తి చేయలేదని అన్నారు. జగన్‌ను రాజకీయ సమాధి చేయడం కోసం మనం అందరం పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
అన్న క్యాంటిన్‌ను సందర్శించిన అయ్యన్న
శృంగవరపుకోట : 
పేదల ఆకలి గుర్తించిన మంచి మనిషి చంద్రబాబు నాయుడు అని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో తాహశీల్దార్‌ కార్యాలయం ఎదుట 111 రోజులుగా దిగ్విజయంగా నిర్వహించబడుతున్న అన్న క్యాంటీన్‌ ఆయన మంగళవారం సందర్శించి పేదలకు భోజనాలను వడ్డించారు. అనంతరం అన్న క్యాంటిన్‌ వద్ద కేక్‌ కటింగ్‌ చేశారు. కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్‌ పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ జివిఎంసి ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, జనసేన పార్టీ సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ (సత్తిబాబు), వసంత్‌ విహార్‌ అధినేత వల్లూరి జయప్రకాష్‌ బాబు, కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.