
రాయచోటి : ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించే ఇవిఎంలు, వివి ప్యాట్స్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని కలెక్టర్ గిరీష రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ గిరీష, ఇవిఎంలు, వివి ప్యాట్స్ల ఎఫ్ఎల్సిపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటింగ్ యంత్రాల ఎఫ్ఎల్సిలో ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి దాదాపు 20 రోజులు పాటు ఓటింగ్ యంత్రాల చెకింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో ఎక్కడ చిన్న తప్పు జరగడానికి వీలు లేదన్నారు. రాయచోటి పట్టణంలోని మార్కెట్ యార్డు వద్దనున్న ఇవిఎం గోడౌన్లలో నిర్వహించే ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ కోసం అవసరమైన సిసి కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్, పటిష్ట పోలీసు బందోబస్తు, కంట్రోల్ రూమ్ తదితర ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. చెకింగ్ హాల్లోకి సెల్ ఫోన్లు, అనుమతి లేదన్నారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున ఏడు మందికి సంబంధించిన ఫొటోలు ఆథరైజేషన్ లెటర్ వెంటనే ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని చెకింగ్ హాల్లోకి వచ్చేవారు తప్పక గుర్తింపు కార్డు ఉండాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఒ సత్యనారాయణ, రాజంపేట ఆర్డిఒ రామకృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.