
లక్నో : ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బలు కొట్టించిన ఉత్తర ప్రదేశ్ ఉపాధ్యాయురాలు తన చర్యను సమర్థించుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులను నియంత్రించడం చాలా ముఖ్యమని, అందుకే ఆ చర్యలు తీసుకున్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తర్ప్రదేశ్లో ముజఫర్నగర్లోని త్రిప్తా త్యాగి అనే ఉపాధ్యాయురాలు శనివారం పాఠశాలలో ముస్లిం విద్యార్థిపట్ల వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాను చేసిన పనికి ఏ మాత్రం బాధపడటం లేదని పేర్కొనడం గమనార్హం. ఆ వీడియోపై మీడియాతో మాట్లాడారు. ''తాను పాఠశాల ప్రిన్సిపల్ రూపంలో గ్రామానికి సేవలందిస్తున్నాను. వారంతా నాతోనే ఉన్నారు. చట్టాలు ఉన్నాయి.. కానీ, పిల్లలను పాఠశాలలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి చర్యలే తీసుకోవాలి'' అని అన్నారు.
అయితే ఈ వీడియో వైరలైన అనంతరం తన తప్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. '' ఇది చాలా చిన్న విషయం. దీనిని పెద్దది చేయాల్సిన అవసరం లేదు. నేను నా తప్పును అంగీకరిస్తున్నాను. కానీ ఈ విషయాన్ని అనవసరంగా పెద్ద సమస్యగా మార్చారు'' అని అన్నారు.
త్రిప్తా త్యాగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముజఫర్ నగర్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టామని, విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అన్నారు. టీచర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
తన కుమారుడిని గంటల తరబడి నిలబెట్టి అవమానించారని, కొట్టారని విద్యార్థి తండ్రి పోలీసులకు తెలిపారు. నా కుమారుడిని తోటి విద్యార్థులు పదే పదే కొట్టారు. ఏదో పనిమీద పాఠశాలకు వెళ్లిన నా మేనల్లుడు ఆ వీడియో తీశాడని చెప్పారు. ఇది హిందూ -ముస్లిం సమస్య కాదని, ఏడేళ్ల విద్యార్థిని రెండు గంటల పాటు హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.