Oct 12,2023 09:00
  •  భారీగా సొమ్ము చేసుకుంటున్న హ్యాకర్లు
  • స్ల్పంక్‌ ఐఎన్‌సి రిపోర్ట్‌

న్యూఢిల్లీ : సైబర్‌ మోసాలు సర్వసాధారణం అయ్యాయి. గడిచిన ఏడాదిలో దాదాపు 90 శాతం సంస్థలు కూడా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో విధంగా రామ్స్‌వేర్‌ అటాక్స్‌కు గురైయ్యాయని స్ల్పంక్‌ ఐఎన్‌సి ఓ రిపోర్ట్‌లో తెలిపింది. దాడి అనంతరం ఇందులోని 83 శాతం సంస్థలు కూడా సైబర్‌ నేరగాళ్లకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. కనీసం లక్ష డాలర్లు చెల్లించాయని తెలిపింది. ఈ దాడులకు అత్యధికంగా విత్త సేవల రంగంలోని 59 శాతం సంస్థలు గురైయ్యాయి. రిటైల్‌ రంగంలోని 59 శాతం సంస్థలు వైద్య రంగంలోని 52 శాతం సంస్థలు సైబర్‌ బారిన పడ్డాయి. వీటిలో 95 శాతం సంస్థలు కూడా సైబర్‌ ఇన్స్యూరెన్స్‌ లేదా థర్డ్‌ పార్టీ ద్వారా చెల్లింపులు చేసినట్లు స్ల్పంక్‌ సర్వేలో తేలినట్లు వెల్లడించింది. ఆర్థిక సవాళ్లు వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ 93 శాతం సంస్థలు కూడా రాబోయే సంవత్సరంలో తమ సైబర్‌ సెక్యూరిటీ బడ్జెట్‌లో పెరుగుదలను ఆశిస్తున్నాయి. సైబర్‌ దాడుల పట్ల వైద్య, తయారీ, ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ వంటి రంగాలు ఎక్కువగా భయాలను వ్యక్తం చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ చర్యలను పెంపొందించడానికి తమ ప్రక్రియల్లో ఆటోమేషన్‌ను విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.