
ప్రజాశక్తి - అరకులోయ, అనంతగిరి (అల్లూరి జిల్లా):తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి టూరిజం కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి మూడో రోజుకు చేరుకుంది. అధికారులు తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను విరమించేదిలేదని వారు స్పష్టం చేశారు. సమ్మెతో అరకులోయలోని మయూరి హరిత రిసార్ట్, హరిత వ్యాలీ రిసార్ట్, అనంతగిరి మండలంలోని బర్రా గుహలు, టైడా జంగిల్ బెల్స్, అనంతగిరి హరిత హిల్ యూనిట్లు మూతపడ్డాయి. ఈ నెల 15న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అరకులోయ పర్యటన ఖరారు కావడం, పర్యాటక శాఖ అతిథి గృహాలు, రెస్టారెంట్లు మూతబడి ఉండడంతో అధికారుల్లోనూ గుబులు మొదలైంది. సోమవారం పాడేరు ఐటిడిఎ పిఒ అభిషేక్ అరకులోయలోని హరిత వ్యాలీ రిసార్ట్కు వెళ్లి సమ్మె విరమింపజేయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. వేరే ప్రాంతం నుంచి వర్కర్లను తీసుకొచ్చి పనులు చేయిస్తామని కొందరు అధికారులు బెదిరింపులకు పాల్పడినప్పటికీ కార్మికులు తిప్పికొట్టారు. అదే క్రమంలో పిఒకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆయన స్పందిస్తూ మంగళవారం పాడేరు ఐటిడిఎ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. అనంతగిరి మండలంలో కార్మికుల సమ్మెకు పలు పార్టీల, ప్రజా సంఘాల మద్దతు లభించింది. జడ్పిటిసి గంగరాజు, సర్పంచ్లు మొస్య, అప్పారావు, సిపిఎం మండల కార్యదర్శి ఎస్ నాగులు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి దేవుడు, గిరిజన, మహిళా సంఘాల నాయకులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. సమ్మె శిబిరం వద్ద కళారూపాలు, థింసా నృత్యం ప్రదర్శిస్తూ కార్మికులు తమ సమస్యలను అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు.