Oct 18,2022 20:43
  • ఈ ఏడాది అమ్మకాలు తగ్గొచ్చు
  • పండగ సీజన్‌లోనూ అంతంతే
  • వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా

న్యూఢిల్లీ : ప్రస్తుత పండగ సీజన్‌లో బంగారం అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసుకోనుందని వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యుజిసి) పేర్కొంది. గతేడాది భారీ అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది స్టోర్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గనుందని అంచనా వేసింది. సాధారణంగా అక్టోబర్‌- డిసెంబర్‌ కాలంలో బంగారు నగలు, నాణేలు, కడ్డీలకు గరిష్ట స్థాయిలో డిమాండ్‌ ఉంటుందని పేర్కొంది. ఈ సీజన్‌లో వచ్చే దీపావళి, అనంతరం పెళ్లిళ్ల సీజన్‌ మార్కెట్‌కు కలిసి వస్తుంది. ఈ క్రమంలోనే గత సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆభరణాల అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇంతక్రితం రెండేళ్లు కరోనాతో స్తంబించిన మార్కెట్‌ ఒక్క సారిగా ఊపందుకుంది. కాగా.. ఈ ఏడాది బంగారం మార్కెట్‌లో మెరుపులు తగ్గాయి. పసిడి వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉంది. దేశంలో నమోదవుతున్న అధిక ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేయడంతో ఆ ప్రభావం పసిడిపై పడుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు హెచ్చు బంగారం ధరలు కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణుల అంచనా.
'' పండగ సీజన్‌ కాలంలో భారత్‌లో 344 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది అమ్మకాలు ఆ స్థాయిలో ఉండే అవకాశం లేదు.'' అని లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న డబ్ల్యుజిసికి చెందిన రీజినల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పిఆర్‌ సోమసుందరం పేర్కొన్నారు. ''మేము ఖచ్చితంగా సంవత్సరం ప్రథమార్థం కంటే పండగ సీజన్‌లో మెరుగైన డిమాండ్‌ను చూస్తాము. అయితే.. ఇది గత సంవత్సరం స్థాయిలో లేదు. ద్రవ్యోల్బణం కొంచెం ఎక్కువగా ఉంది. దీన్ని సంక్షోభంగా భావించొద్దు. బంగారం కేవలం కాలానుగుణంగా పెరుగుతోంది. ఈ సమయంలో బంగారం వైపు ఎలాంటి సంక్షోభం లేదు. భారత పసిడి డిమాండ్‌ 2022లో 750 టన్నులకు తగ్గే అవకాశాలున్నాయి. గతేడాది ఇది 800 టన్నులుగా నమోదయ్యింది.. ఇటీవల యాప్‌లు లేదా వెబ్‌ల ద్వారా చేసే డిజిటల్‌ బంగారం విక్రయాలు కూడా ప్రజల అభిమానాన్ని ఆకర్షిస్తున్నాయి.'' అని సోమసుందరం పేర్కొన్నారు.