Apr 11,2023 15:38

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మున్సిపల్‌ కార్మికుల జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ మంగళవారం చిట్వేల్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు, ఆటో డ్రైవర్లకు రాష్ట్రవ్యాప్తంగా 2 నుండి 4 నెలల వేతనాలు పెండింగులో ఉన్నాయని తెలిపారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఆప్కాస్‌ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం తిరుపతి, మన్యం, పార్వతీపురం, విజయనగరం తదితర జిల్లాలలో 2 నుండి 4 నెలల వేతనాలు పెండింగ్‌ లో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్‌ రెండవ వారంలో కూడా వేతనాలు చెల్లించకుంటే కార్మికులు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులలో సగానికి పైగా దళితులు, గిరిజనులు ఉన్నారని.. వారు ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈస్టర్‌ పండుగకు కూడా జీతాలు చెల్లించకుండా కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కట్లు పాలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ నుండి కార్మికులకు నేరుగా చెల్లించే హెల్త్‌ అలవెన్స్‌ సహితం చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. ఆప్కాస్‌ వ్యవస్థ ద్వారా 60 ఏళ్లు నిండిన వారిని బలవంతంగా ఉద్యోగాలను తొలగించారని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మునిసిపాలిటీలలో కార్మికుల కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తో పాటు గ్రాట్యుటీ కూడా చెల్లించాలని., అయితే ఇవేమీ వర్తింపజేయకుండా కార్మికులను ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయిస్తున్నారని అన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచినప్పటికీ ఇందుకు సంబంధించి నేటికీ ఉత్తర్వులు జారీ చేయకపోవడం శోచనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మికుల యూనియన్‌ నాయకులు సీ.హెచ్‌ ఓబయ్య, కార్మికులు ప్రసాద్‌, సాలమ్మ, రవి ప్రకాష్‌, సుబ్బన్న, రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.