Oct 17,2022 21:43
  • ఆఫీసులకు రానంటున్న ఐటి ఉద్యోగులు
  • 88% సిబ్బంది అభిప్రాయం
  • సిఐఇఆర్‌ హెచ్‌ఆర్‌ సర్వే

హైదరాబాద్‌ : ఇంటి నుంచి పని చేస్తున్న ఐటి ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి నిరాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించిన కంపెనీలకు ఇది ఇప్పుడు తలనొప్పిగా మారింది. సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. దీనిపై స్టాఫింగ్‌ సర్వీసెస్‌ సంస్థ సిఐఇఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఓ సర్వే చేసింది. సిఐఇఎల్‌ ఐటి రంగంలోని 19 కంపెనీల్లోని 1000 మంది అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్టును రూపొందించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆఫీసులకు రావాలని కంపెనీలు ఒత్తిడి చేస్తే 88 శాతం మంది రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్ని వదిలేసి.. వర్క్‌ ఫ్రం హోమ్‌ సౌలభ్యం ఉన్న కంపెనీలకు మారడానికి అవకాశాలను వెతుక్కుంటున్నారు. వీరిలో అత్యధికంగా వర్కింగ్‌ తల్లులు ఉండటం విశేషం. ఇంటి నుంచి పని చేసే ఐటి ఉద్యోగులు చాలా మంది ఇటీవల రెండేసి కంపెనీలకు సేవలందిస్తున్నారు. దీంతో టాప్‌ ఐటి కంపెనీలు తమ సిబ్బందిని ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాయి.