Apr 02,2023 07:52
  • రిజిస్ట్రార్లకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మెమో

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రిజిస్ట్రేషన్లలో మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లశాఖ ఐజి రామకృష్ణ శనివారం మెమో నెంబరు 1730463 జారీచేశారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో అప్పటి వరకూ ఖాళీ స్థలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన విఎల్‌టి (వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌) కడితేనే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. అలా కట్టకుండా చేస్తే సబ్‌ రిజిస్ట్రార్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. గతంలో పాత డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్లు చేసేవారు. అయితే నూతన పద్ధతిలో పాత డాక్యుమెంటుతోపాటు అంతకుముందు కట్టిన ఆస్తిపన్నుగానీ, ఖాళీస్థలమైతే దానిపన్నుగానీ జతచేయాల్సి ఉంటుంది. టిడిసిపి అనుమతి ఉంటే రిజిస్ట్రేషన్‌ జరిగేది. ఇప్పుడు ఖచ్చితంగా పట్టణ సంస్థల అనుమతి ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. భూమి స్థితిని మార్చుకున్నా దానికి సంబంధించి అనుమతి వచ్చిన తరువాతే రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్‌ సమయంలో అనుమతి పొందిన ప్లాను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. ఒక్క వీలునామాకు మినహా అన్ని తరహా రిజిస్ట్రేషన్లకు ఖచ్చితంగా విఎల్‌టి రశీదులు జత చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమికైతే 1బి అడంగలును ఖచ్చితం చేశారు. గతంలో పాసు పుస్తకం, డాక్యుమెంటు అధారంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇక ముందు 1బి అడంగలు తప్పనిసరి చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయడానికి వచ్చిన వ్యక్తి పేరు ఒకటే ఉండాలని నిబంధన పెట్టారు. తమిళనాడు ప్రభుత్వం చేసిన పద్ధతిలో దీన్ని అమలు చేస్తున్నామని మెమోలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లో సెక్షన్‌ 22బి కింద నూతన మార్పులు చేర్పులు చేసినట్లు స్పష్టం చేశారు. నూతన పద్దతిలో అసెస్‌మెంట్‌ నెంబరు, విఎల్‌టి, పట్టణ సంస్థలో ప్లాను, డిటిసిపి అయితే ఐఇఎల్‌పి తప్పనిసరి చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో వెబ్‌ల్యాండ్‌ రికార్డులో, పట్టాదారు పాసు పుస్తకంలో యజమాని పేరు స్పస్టంగా లేకపోతే దాన్ని రిజిస్ట్రేషన్‌ చేయడానికి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. ఒకవేళ అలా కాకుండా రిజిస్ట్రేసన్లు జరిగితే వాటిని రద్దు చేసే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. రీసర్వే పూర్తి చేసిన ప్రాంతాల్లో ఎల్‌పిఎం నంబర్ల అధానంగా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. రెండో సారి అదే స్థలం రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వస్తే తహశీల్దార్‌ సదరు ఆస్తిని సబ్‌ డివిజన్‌ చేసిన తరువాతే వాటిని రిజిస్ట్రేషన్‌ కోసం అనుమతిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లలో ఆస్తి ఒకటి కంటే ఎక్కువ ఎల్‌పిఎంలు ఉంటే వాటికి విడివిడిగానే ఎల్‌పిఎం జారీచేస్తామని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ఇన్‌ప్రిన్సిపల్‌ లేఅవుట్‌ ప్యాట్రన్‌ నంబరు అధార్‌ జతచేయాలని తెలిపారు. బిల్డింగ్‌ ప్లాను కూడా డాక్యుమెంట్లో ఉన్న వ్యక్తుల పేరుతో ఖచ్చితంగా ఉండాలని అలా లేనివాటికి రిజిస్ట్రేషన్లు చేయడం సాధ్యం కాదని వివరించారు. రిజిస్ట్రార్‌ అన్ని డాక్యుమెంట్లు చూసి ఆమోదయోగ్యంగా ఉన్నాయని ధృవీకరించిన తరువాత మాత్రమే వాటిని రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీ స్థలాలకు సంబంధించి రిజిస్టరింగ్‌ అధికారి ఎగ్జిక్యూటెంట్‌ లేదా డెవలపర్లు లేదా భూమి యజమాని పేరు విఎల్‌టి, లేఅవుట్‌ ప్లానులో సక్రమంగా ఉందని నిర్థారించుకున్న తరువాతే రిజిస్ట్రార్‌ అనుమతి ఇవ్వాలని సూచించారు. ఆయా డాక్యుమెంట్లు అన్నీ స్థానిక సంస్థల ఎలాక్ట్రానిక్‌ డేటాతో సరిచూసుకోవాల్సి బాధ్యత కూడా రిజిస్ట్రార్లకే అప్పగించారు. లేఅవుట్‌ అనుమతి ఉన్నా లింక్‌ డాక్యుమెంట్లు సరైనవో కావో ధృవీకరించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఎక్కడైనా తేడాలు కనిపిస్తే సబ్‌ రిజిస్ట్రార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హెచ్చరించారు. వీటిపై సబ్‌ రిజిస్ట్రార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమికి సంబంధించి మొదటి, రెండో పార్టీ అగ్రిమెంటు అయి డాక్యుమెంటు తీసుకొస్తే తాము రిజిస్ట్రేషన్‌ చేస్తామని, ఇప్పుడు అన్నీ తమనే ధృవీకరించుకోవాలని పెడుతున్నారని తెలిపారు. ఎవరైనా తప్పుడు వివరాలు నమోదు చేస్తే తమను శిక్షిస్తామనే విధంగా కొత్త నిబంధనలు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకూ నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తే చేసినవారు, చేయించుకున్న వారిని నేరస్తులుగా పరిగణించేవారు. నూతన నిబంధనల ప్రకారం సబ్‌రిజిస్ట్రార్లను కూడా నేరస్తుల జాబితాలో చేర్చారని, సీనియర్‌ సబ్‌రిజిస్ట్రార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.