Mar 11,2023 22:10

క్రైస్ట్‌చర్చి: శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్‌ ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యత సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5 వికెట్ల నష్టానికి 162పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ జట్టు 373పరుగులకు ఆలౌటైంది. మిఛెల్‌(102), హెన్రీ(72) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో న్యూజిలాండ్‌కు 18పరుగుల స్వల్ప ఆధిక్యల లభించింది. ఫెర్నాండోకు నాలుగు, కుమారకు మూడు, రజితకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 83పరుగులు చేసింది. మాథ్యూస్‌(20), జయసూరియ(2) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 355పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
డ్రా అయితే.. డబ్ల్యుటిసి ఫైనల్‌కు భారత్‌..
న్యూజిలాండ్‌ాశ్రీలంక జట్ల మధ్య తొలిటెస్ట్‌ డ్రా అయితే భారతజట్టు ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు చేరనుంది. న్యూజిలాండ్‌ చేతిలో శ్రీలంక ఓడినా డబ్ల్యూటిసి ఫైనల్లో అడుగుపెట్టేది టీమిండియానే. మరోవైపు టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ టీమిండియా ఓడిపోతే మాత్రం పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుంది. శ్రీలంక జట్టు తొలిటెస్ట్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ాఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో టెస్ట్‌ డ్రా అయితే మాత్రం సమీకరణలు మారే అవకాశముంది.