Aug 06,2023 11:12

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఆదివారం అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఇండిగో విమానంలో జెడ్డా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఇద్దరు ప్యాసింజర్లు వచ్చారు. ఎయిర్‌ పోర్టు కస్టమ్స్‌ అధికారులు సోదాలు చేయగా, వారి వద్ద కోటి రూపాయల విలువైన అక్రమ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల దగ్గర ఫోర్‌ టేబుల్‌ స్పీకర్స్‌, ఐరన్‌ బాక్స్‌లో 1.88 కిలోల అక్రమ బంగారంను గుర్తించి వాటిని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వారిని ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్‌ లో 1.11 కోట్ల రూపాయలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు నిందితులను విచారణ చేస్తున్నారు.
            మరోవైపు.. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో మరో ముఠా దుబారు నుంచి వచ్చిన వేరు వేరు విమానాల్లో వచ్చిన నలుగురు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న బంగారం తీసుకు వస్తుండగా.. దాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. రూ. 77.02 లక్షల విలువ చేసే బంగారాన్ని గోల్డ్‌ చైన్లు,బిస్కెట్లు, పేస్టు రూపంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని వాటి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.