- కర్నూలులో పోస్ట్ కార్డు ఉద్యమం
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్:రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన జిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉత్తరాలు పంపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లప్ప, జయరాజు మాట్లాడుతూ.. అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ స్థానంలో ఒపిఎస్ ప్రవేశ పెడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం సిపిఎస్ను రద్దు చేస్తానన్న హామీని జగన్మోహన్రెడ్డి విస్మరించారన్నారు. సిపిఎస్ స్థానంలో జిపిఎస్ను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనం నుండి కాంట్రిబ్యూషన్ వసూలు చేసే జిపిఎస్ పథకం వద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 అనుసరించి 2004 సెప్టెంబర్ ఒకటికి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారందరూ పాత పెన్షన్కు అర్హులని పేర్కొన్నారు. డిఎస్సి-2003 ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.










