Jul 16,2023 09:35

బ్రస్సెల్స్‌ : ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు, రంగాల్లో కాలుష్యకారక వాయువులను తగ్గించడం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ సమస్యను పరిష్కరించాలని ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి వాతావరణ చర్చల విభాగ అధిపతి సుల్తాన్‌ అల్‌ జబర్‌ ప్రభుత్వాలకు, వ్యాపార వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు. ఏడేళ్ళ క్రితం ఆమోదించిన కీలకమైన ఉష్ణోగ్రత పరిమితిని దాటకుండా భూగోళాన్ని నిలువరించాలని ప్రపంచ నేతలు కోరుకున్నట్లైతే తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాల్సి వుందని అన్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన జబర్‌ ఆ దేశంలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో ఒకదానికి నాయకత్వం వహిస్తున్నారు. బ్రస్సెల్స్‌లో సమావేశమైన యూరప్‌, కెనడా, చైనాలకు చెందిన అధికారులతో ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాటిని పరిశీలిస్తే అత్యవసర చర్యల ఆవశ్యకత తెలుస్తుందన్నారు. దుబాయిలో త్వరలో జరగాల్సిన కాప్‌-28 అంతర్జాతీయ వాణిజ్య చర్చలకు అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలకు కారణాలు ఏమిటి, వాటిని మరింత పెరగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటనే అంశాల్లో నేతలు అత్యంత నిజాయితీగా వ్యవహరించాల్సి వుందన్నారు. అన్ని చోట్లా అన్ని రకాల కాలుష్యాలను అరికట్టాల్సిన అవసరం వుందని స్పష్టం చేశారు. 2015 పారిస్‌ వాతావరణ ఒప్పందానికి అనుగుణంగా గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పరిమితం చేసేందుకు ఒక ఆచరణాత్మక ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వాలను, ప్రధాన ఇంధన ఉత్పత్తిదారులను, భారీగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఒక చోటకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు చెప్పారు.