ముంబయి : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి సంబంధించిన పలు మోడళ్ల వాహనాల్లో ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లలో లోపాలు తలెత్తాయి. ఈ లోపం కారణంగా వాహనం యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్బ్యాగ్లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. అలాంటి 17,362 కార్లను రీకాల్ చేస్తున్నట్లు బుధవారం ఆ కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 2022 డిసెంబరు 8 నుంచి 2023 జనవరి 12 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో అల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో, గ్రాండ్ విటారా తదితర మోడళ్లున్నాయని పేర్కొంది. ఈ వాహనాల్లో అవసరమైతే ఎయిర్బ్యాగ్ కంట్రోలర్ను ఉచితంగా తనిఖీ చేసి కొత్తది బిగించి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లలో మార్చే వరకు వాహనాన్ని ఉపయోగించకూడదని వినియోగదారులను కోరింది.










