Nov 02,2023 10:28
  • రూ.5,272 కోట్లు (57 శాతం)
  • కాంగ్రెస్‌కు కేవలం 10 శాతమే
  • ఎడిఆర్‌ స్పష్టం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అత్యధిక ఎలక్టోరల్‌ బాండ్లు బిజెపికే వచ్చాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) స్పష్టం చేసింది. ఎడిఆర్‌ డేటా ప్రకారం, ఎలక్టోరల్‌ బాండ్లు 2021-22 వరకు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి రూ. 9,188 కోట్లకు పైగా విరాళాలుగా అందించాయి. అందులో బిజెపికి 57 శాతం పైగా నిధులు అందగా, కాంగ్రెస్‌కు కేవలం 10 శాతం మాత్రమే అందాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య, డేటా అందుబాటులో ఉన్న చివరి సంవత్సరం వరకు ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా మొత్తం రూ.9,188.35 కోట్ల విరాళాన్ని అందుకున్నాయి. ఇందులో కమలం పార్టీకి రూ.5,272 కోట్లు, కాంగ్రెస్‌కు కేవలం రూ.952 కోట్లు రాగా, మిగిలినవి ఇతర పార్టీలకు చేరాయి.

11


          జాతీయ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. 2017-18 నుంచి 2021-22 మధ్య 743 శాతం పెరుగుదల ఉంది. దీనికి విరుద్ధంగా, అదే సమయంలో జాతీయ పార్టీలకు కార్పొరేట్‌ విరాళాలు 48 శాతం మాత్రమే పెరిగాయని ఏడీఆర్‌ పేర్కొంది. రాష్ట్ర పార్టీలు కూడా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా తమ విరాళాలలో గణనీయమైన భాగాన్ని పొందాయి.
          2016-17 నుంచి 2021-22 మధ్య రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో సగానికి పైగా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చినవేనని, ఇతర జాతీయ పార్టీలన్నింటి కంటే బిజెపికి ఎక్కువ నిధులు వచ్చాయని ఏడీఆర్‌ తెలిపింది. 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఏడు జాతీయ పార్టీలు, 24 రాష్ట్ర పార్టీల ద్వారా దాదాపు రూ.16,437 కోట్ల విలువైన విరాళాలు అందాయని పేర్కొంది. ఇందులో రూ.9,188.35 కోట్లు (దాదాపు 56 శాతం) ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా స్వీకరించబడ్డాయి.
పార్టీలకు రాజకీయ నిధుల కోసం ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ బుధవారం కూడా కొనసాగింది.
 

                                    అక్టోబర్‌లో రూ.1,148 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు : హైదరాబాద్‌లోనే అత్యధిక బాండ్లు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు రూ.1,148 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం జరిగింది. వీటివల్ల వివిధ పార్టీలకు చేరిన కోట్ల రూపాయలు నిధులు సమకూరాయి. 28వ విడత ఎలక్టోరల్‌ బాండ్లను అక్టోబర్‌ 4 నుంచి 14 వరకు విక్రయించగా, అక్టోబర్‌ 9న ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) అక్టోబర్‌లో మొత్తం రూ.1,148.38 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్‌లను విక్రయించింది. అత్యధిక హైదరాబాద్‌ శాఖలో (33 శాతం) అమ్మకాలు జరిగాయి.
          ఈమేరకు సమాచార హక్కు అర్జీకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఎస్‌బిఐ హైదరాబాద్‌ శాఖ రూ. 377.63 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించింది. ఇది మొత్తంలో దాదాపు 33 శాతం, కానీ ఎన్‌క్యాష్‌ చేయడానికి సమయం వచ్చినప్పుడు, తెలంగాణ రాజధానిలో రాజకీయ పార్టీలు రూ. 83.63 కోట్లు (7 శాతం) మాత్రమే రీడీమ్‌ చేశాయి. పారదర్శకత ప్రచారకర్త కమోడోర్‌ లోకేష్‌ కె బాత్రా (రిటైర్డ్‌) ఆర్‌టిఐ ప్రశ్నకు ఎస్‌బిఐ ఇచ్చిన సమాధానంలో 25 రాజకీయ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్లను రీడీమ్‌ చేయడానికి ఖాతాలు తెరిచాయని తెలిపింది.
         ఎలక్టోరల్‌ బాండ్ల అమ్మకాలలో, హైదరాబాద్‌ తరువాత టాప్‌ బ్రాంచ్‌లుగా కలకత్తా (రూ.255.28 కోట్లు), ముంబాయి (రూ.177.90 కోట్లు), న్యూఢిల్లీ (రూ.130.68 కోట్లు), చెన్నై (రూ.95.50 కోట్లు) ఉన్నాయి. జాతీయ పార్టీలు తమ ఖాతాలను కలిగి ఉంటాయని భావిస్తున్న ఎస్‌బిఐ న్యూఢిల్లీ శాఖలో అత్యధిక మెజారిటీ ఎలక్టోరల్‌ బాండ్లు ఎన్‌క్యాష్‌ చేయబడ్డాయి. న్యూఢిల్లీలో రూ. 800 కోట్లు (70 శాతం), కలకత్తా రూ.171.28 కోట్లు, హైదరాబాద్‌, ముంబాయిల్లో రూ. 39 కోట్లు చొప్పున, పాట్నాలో 25 కోట్లు ఎన్‌క్యాష్‌ చేయడంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఎలక్టోరల్‌ బాండ్లు రూ. 1,000, రూ. 10,000, రూ. 1 లక్ష, రూ. 10 లక్షలు, రూ. 1 కోటి డినామినేషన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, అతిపెద్ద డినామినేషన్‌ అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం, ఎస్‌బిఐ 2,012 వ్యక్తిగత ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించింది. వీటిలో సగానికి పైగా (1,095) రూ. 1 కోటి విలువ కలిగి ఉన్నాయి.