
బెంగళూరు : డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు మరో షాక్ తగిలింది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు.. గురువారం జరిగిన కీలకమైన మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లంక బౌలర్ల ధాటికి 156 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని లంక.. 25.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (11) విఫలమైనా.. పాథుమ్ నిశాంక (77 రన్స్, 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు), సదీర విక్రమార్క (65 రన్స్, 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు బాదడంతో లంక సునాయసంగా విజయం సాధించింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయి లంక ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో నిశాంక, విక్రమార్క క్రీజులో నిలదొక్కుకుని నిలకడగా బౌండరీలు బాది జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు వికెట్లు పడగొట్టాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంక పేసర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒక్కరు కూడా అర్ధ శతకం చేయలేకపోయారు. బెన్స్టోక్స్ (43 రన్స్, 73 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్. జానీ బెయిర్స్టో (30 రన్స్, 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28 రన్స్, 25 బంతుల్లో 6 ఫోర్లు) కాసేపు నిలకడగానే ఆడినా ఎక్కువ సమయం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ (15 రన్స్ 15 బంతుల్లో) కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్ వోక్స్ (0), ఆడిల్ రషీద్ (2), మార్క్ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్ 2, కాసున్ రజిత 2, మహీశ్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.
సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం
శ్రీలంకపై ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడి ఒకే మ్యాచ్లో నెగ్గింది. అది కూడా బంగ్లాదేశ్పై. కివీస్, ఆఫ్గనిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధిస్తేనే సెమీస్కు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఆ నాలుగు మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించడం అంత సులువు కాదు. భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్తో ఆ జట్టు తలపడాల్సి ఉండటమే ఇందుకు కారణం.
ఇంగ్లండ్ తన తర్వాతి మ్యాచ్లో టీమ్ ఇండియాతో తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేనపై పైచేయి సాధించాలంటే ఇంగ్లండ్ శక్తికి మించి కృషి చేయాల్సిందే. మరోవైపు, మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్.. తర్వాత మూడు మ్యాచుల్లో నెగ్గి సెమీస్ రేసులో ముందుకొచ్చింది. నెదర్లాండ్స్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సౌతాఫ్రికాను డచ్ జట్టు ఎలా చిత్తుగా ఓడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్ కూడా తనదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలదు. ఈ సవాళ్లను అధిగమించి ఇంగ్లండ్ సెమీస్కు వస్తే అది అద్భుతమే అవుతుంది.