Jul 11,2023 10:12
  • మూడు పడవల్లో సెనెగల్‌ నుంచి కానరీ దీవులకు పయణం

మూడు పడవల్లో వెళ్తున్న 300 మంది వలసదారులు అట్లాంటిక్‌ మహా సముద్రంలో అదృశ్యమయ్యారు. 15 రోజుల క్రితం వీరంతా సెనెగల్‌ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలండ్స్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక బోటులో 200 మంది, మిగతా రెండు బోట్లలో ఒకదాంట్లో 65 మంది, మరో దాంట్లో 60 మంది ఉన్నట్టు వలసదారులకు సాయం చేసే 'వాకింగ్‌ బోర్డర్స్‌' సంస్థ తెలిపింది. అదృశ్యమైన వారు ఏమయ్యారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలా వెళ్తూ గతేడాది 1,784 మంది వలసదారులు మరణించినట్టు వాకింగ్‌ బోర్డర్స్‌ పేర్కొంది. గతేడాది కానరీ ఐలండ్స్‌కు 15,682 మంది చేరుకున్నారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం తగ్గిందని స్పెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.