May 16,2023 22:53

  • ఎ ప్లస్‌ కన్వెక్షన్‌లో ఏర్పాట్లు పరిశీలన

ప్రజాశక్తి-విజయవాడ: ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్లను ఘనంగా సన్మానించనున్న దృష్ట్యా మంగళవారం శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రాఘరామ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌, నగరపాలక సంస్థ మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, నగరంలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రాఘరామ్‌ మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా వలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాకు చెందిన రెండు వేల మంది వలంటీర్లను ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సన్మానించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలన్నారు. సీట్ల సర్దుబాటు, సౌండ్‌ సిస్టమ్‌, పోలీస్‌ బందోబస్తు, తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ పరిశీలనలో పార్లమెంట్‌ సభ్యులు నందిగం సురేష్‌, ప్రభుత్వ విద్య సంస్థల సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దౌవులూరి దొరబాబు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ తదితరులు ఉన్నారు.