Sep 27,2023 14:45

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై గతేడాది నమోదుచేసిన కేసులో ఆయన పేరును తాజాగా సీఐడీ చేర్చింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ అధికారులు మంగళవారం మెమో సమర్పించారు. ఈ కేసులో ఏ 14గా లోకేశ్‌ను పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు.నైపుణ్యాభివఅద్ధి సంస్థ కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుపై ఇటీవలే ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ కేసులో సీఐడీ అధికారులు పీటీ వారంట్‌ దాఖలుచేశారు. దానిపై విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ దశలో అదే కేసులో ఇప్పుడు లోకేశ్‌నూ నిందితుడిగా చేర్చారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో యువగళం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేసిన లోకేశ్‌.. ఈ యాత్రను ఆగినచోటి నుంచే ఈ నెల 29న మళ్లీ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నమోదైన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ఇప్పటికప్పుడు లోకేశ్‌ను నిందితుడిగా చేర్చడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా అక్రమ కేసులన్నింటినీ తెరపైకి తీసుకొచ్చి వాటిని చంద్రబాబు, లోకేశ్‌ల మెడకు చుట్టడమే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని టిడిపి ఆరోపిస్తోంది.