Apr 07,2023 18:51

విద్యార్థికి కోడింగ్‌ కార్డు పంపిణీ చేస్తున్న నరసింహారెడ్డి

ప్రజాశక్తి - రాయచోటి :స్కౌట్స్‌ శిక్షణ విద్యార్థుల సర్వతో ముఖాభివద్ధికి తోడ్పడుతుందని స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ పి.శ్రీనివాసరావు అన్నారు. కడప నగరం శంకరాపురంలోని స్కౌట్‌ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్కౌట్‌ విద్యార్థుల రాజ్య పురస్కార్‌ టెస్టింగ్‌ క్యాంపును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ, సామాజిక సేవ, దేశ భక్తి పెంపొందడానికి స్కౌట్‌ శిక్షణ తోడ్పడుతుందన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కౌట్‌ సర్టిఫికెట్‌ కలవారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్‌ సౌకర్యం కలదన్నారు. గవర్నర్‌ ద్వారా రాజ్య పురస్కార్‌ సర్టిఫికెట్‌ పొందిన తర్వాత రాష్ట్రపతి సర్టిఫికెట్‌ పొందేందుకు కూడా శక్తి వంచన లేకుండా విద్యార్థులు కషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు కోడింగ్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎల్‌ఒసి (లీడర్‌ ఆఫ్‌ ది కోర్స్‌) బి.శివ నాగిరెడ్డి, జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ లక్ష్మీకర, అసిస్టెంట్‌ సెక్రటరీ శివప్రసాద్‌, ట్రెజరర్‌ రమణయ్య, శివప్రసాద్‌, స్కౌట్‌ మాస్టర్లు బాలసుందరం, ఖాదర్‌బాష పాల్గొన్నారు.