నిధులున్నా.. విడుదలవ్వని వైనం
ఎలా బతకాలంటున్న పాఠశాలల ఆయాలు
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి : 'నాడు-నేడు' ద్వారా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మారుస్తున్న ప్రభుత్వం, వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న ఆయాల సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదు. ఇచ్చే అరకొర వేతనాలను సైతం పెండింగ్లో పెట్టింది. గతేడాది తొమ్మిది నెలలు, ఈ ఏడాది ఆరునెలల బకాయిలు నేటీకి చెల్లించలేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని, అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఆయాలను నియమించారు. 300 మందిలోపు విద్యార్థులు ఉంటే ఒక ఆయాను, 301 నుంచి 600 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, 601 నుంచి 900 మందికి ముగ్గురు, 900 పైగా విద్యార్థులు ఉంటే నలుగురిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో ఆయాలను నియమించుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో శానిటేషన్ పనులు నిర్వహించే వారికి ఇప్పటి వరకు నెలకు రూ.2 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసేవారికి రూ.2,500, ఉన్నత పాఠశాలలో పనిచేసేవారికి వారికి రూ.4 వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు.
తూర్పుగోదావరి జిల్లాలో 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 200 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 4,200 మంది ఆయాలు పని చేస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి తొమ్మిది నెలల వేతనాలు నేటికీ అందలేదు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నుంచి జులై వరకు నెలకు రూ.1000 చొప్పున 6నెలలకు రూ.6 వేలు అమ్మఒడి సొమ్ముల నుంచి అందిస్తామని ప్రభుత్వం చెప్పింది.
కాని నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా రూ.1.86 కోట్లు పెండింగులో ఉన్నాయి. దీంతో చాలా మంది ఆయాలు విధులకు రావడం మానేశారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి నెలకు రూ.6 వేలు చొప్పున 10 నెలలు, మిగిలిన రెండు నెలలకు(వేసవి సెలవుల రోజుల్లో) నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. పాఠశాల ప్రారంభమైన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు కొంత మందికి ఈ మొత్తాన్ని జమ చేశారు. కొందరివి బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, ఫోన్నెంబర్ల లింకేజీ తదితర సాంకేతిక కారణాలతో జమ కాలేదు.
కర్నూలు జిల్లాలో 2750 మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో 3650 మంది ఆయాలు పని చేస్తున్నారు. ఈఏడాది ఆగస్టు నుంచి వారికి వేతనాలు అందడం లేదు. ఏజెన్సీలకు బిల్లులు కూడా రావడం లేదు.
తగినన్ని నిధులున్నా...
ఒక్కొక్క ఆయాకు నెలకు రూ.6 వేల ప్రకారం ఏడాదికి పది నెలలు గౌరవ వేతనం ఇచ్చేలా ఆదేశాలు ఉన్నాయి. రెండు నెలల వేసవి సెలవుల్లో సగం జీతం చెల్లించాలని పాఠశాల విద్యాకమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమ్మఒడి సొమ్ము రూ.15 వేలు కాగా, రూ.వెయ్యి పోను మిగతా రూ.14 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కాని ఇప్పటికీ ఈ నిధుల నుంచి ఆయాలకు వేతనం చెల్లించలేదు. తగినన్ని నిధులు ఉన్నా, జిల్లా విద్యాశాఖ అధికారులు వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
వేతనాలిచ్చి ఆదుకోండి
పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేదుకు ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. ఇచ్చే అరకొర వేతనాలూ బకాయి పెట్టారు. గతేడాది పని చేసిన తొమ్మిది నెలల వేతనం నేటికీ అందలేదు. ఇప్పుడు మూడు నెలలకు జీతం ఇవ్వాల్సి ఉంది. వేతనాల విడుదల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలి.
- నక్కా దుర్గమ్మ, మండల ప్రజాపరిషత్ పాఠశాల, ఎబి.నగర్, పి.గన్నవరం మండలం
నవంబరు వరకూ వేతనాలు ఇచ్చేసాం
ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబరు వరకూ జిల్లాలో ఉన్న ఆయాలందరికీ వేతనాలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశాం. సాంకేతిక కారణాల వల్ల కొందరికి అందలేదు. గతేడాది పెండింగ్లో ఉన్న వేతనాలకు సంబంధించిన బిల్లులు పెట్టాం. మంజూరు కాగానే ఖాతాలకు జమ చేస్తాం.
- ఎస్.అబ్రహం, డిఇఒ










