ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. కార్యక్రమంలో డెప్యూటీ ఇఒ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఇంజనీరింగ్ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.










