ఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ నేతృత్వం వహిస్తున్న కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. సుప్రీం మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. త్వరలోనే హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.










