Jul 25,2021 07:50

కోల్‌కతా : దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు పిజి, పిహెచ్‌డి స్థాయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడమే అందుకు నిదర్శనాలు. ఇటువంటి సంఘటనే బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. శవ పరీక్షలు నిర్వహించే ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ విభాగం ల్యాబ్‌ సహాయకుల పోస్టుల నిమిత్తం కోల్‌కతాలోని నీల్‌ రతన్‌ సిర్కార్‌ వైద్య కళాశాల దరఖాస్తులను ఆహ్వానించింది. కేవలం 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్హత 8వ తరగతని పేర్కొంది. కానీ దానికి వచ్చిన దరఖాస్తులు చూసి అధికారులే ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. 6 పోస్టులకు గాను 8 వేల దరఖాస్తులు వచ్చాయి. పోనీ దీనికి వేతనం ఎక్కువనుకుంటే.. కేవలం రూ. 15 వేలు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఏకంగా బిటెక్‌,పిజి, గ్రాడ్యుయేషన్‌ చేసిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంజనీర్లు 100, గ్రాడ్యుయేట్లు 2,200 మంది, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు 500 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. దరఖాస్తులను వడపోయగా...84 మంది మహిళలతో సహా 784 మందిని రాత పరీక్షకు ఎంపిక చేశారు. వీరికి ఆగస్టు 1న పరీక్ష నిర్వహిస్తారు. డోమ్‌గా పిలవబడే ఈ ఉద్యోగాలకు అర్హతకు మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారని, ఇటువంటి పోస్టులకు గతంలో పనిచేసిన ఉద్యోగుల పిల్లలే దరఖాస్తు చేసుకుంటారని ఓ అధికారి చెప్పారు.