Sep 17,2020 07:51

సెప్టెంబరు 1, 2020, గ్రేటర్‌ లెబనాన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బీరుట్‌ లోని తన అధికారిక నివాసం నుంచి ఫ్రెంచ్‌ జనరల్‌ గౌరాడ్‌ ప్రకటించిన రోజు. శత వార్షికోత్సవాలు జరుపుకోవాల్సిన తరుణంలో లెబనాన్‌ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక వైపు క్షామం, మరో వైపు గత ముప్పయ్యేళ్లుగా పాలక వర్గాలు అనుసరించిన ఆర్థిక, ద్రవ్య విధానాలు లెబనాన్‌ను సంక్షోభాల సుడిగుండంలోకి నెట్టాయి. బీరుట్‌ పోర్టు వద్ద అమ్మోనియం నైట్రేట్‌ గోదాములో జరిగిన భారీ పేలుడుతో పది కిలో మీటర్ల పరిధి దాకా చెల్లా చెదురుగా పడి ఉన్న, కూలిన పోర్టు భవనాలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల శిథిలాల కింద చిక్కుకుపోయిన లెబనీయుల మృత దేహాలను ఒక్క చోటకు చేర్చుతున్న తరుణంలో గ్రేటర్‌ లెబనాన్‌ శతవార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు నూట నలబై మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని వెంటేసుకుని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమానియెల్‌ మాక్రాన్‌ బీరుట్‌కు చేరుకున్నారు. ఫ్రెంచ్‌ యుద్ధ విమానాలు బీరుట్‌ గగన తలంపై రెండు ఎర్రటి చారలు, వాటి మధ్యలో ఆకుపచ్చని రంగు రేఖను గీస్తూ విన్యాసాలు చేశాయి.ఆ సంబరం అక్కడితో ముగియలేదు. దానికి కొనసాగింపుగా లెబనాన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుల మధ్య చర్చలు, సంప్రదింపులు మొదలయ్యాయి. వీటిలో ఇరు దేశాల పార్లమెంటు స్పీకర్లు పాల్గొన్నారు. ఆ తరువాత వారంతా విందుకు వెళ్లారు. లెబనీయులను తమ కింద అణగిమణగి ఉండేలా వందేళ్ల పాటు శాసించామన్న దర్పంతోకూడిన మత పెద్దలు కూడా ఈ విందుకు హాజరయ్యారు. లంచ్‌ తరువాత ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ పాలకవర్గ పార్టీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. ఎవరైతే లెబనాన్‌ను సంక్షోభం లోకి నెట్టారో ఆ నాయకుల్నే లెబనాన్‌ను ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సలహాలు చెప్పమని అడిగారు.
ఇదంతా చూసినప్పుడు 1920 సెప్టెంబరు 1న లెబనాన్‌లో మత పెద్దలకు పెద్ద పీట వేస్తూ బాబ్డా, పైన్‌్‌ ప్యాలెస్‌ నుంచి ఫ్రెంచ్‌ జనరల్‌ గౌరాడ్‌ చేసిన ప్రకటన గుర్తుకు తెస్తుంది (పక్కన చిత్రం చూడొచ్చు). లెబనాన్‌ లోని క్రిస్టియన్లకు, ముస్లింలకు కోటా కల్పిస్తూ గౌరాడ్‌ మత పెద్దలు, రాజకీయ నాయకుల సమక్షంలో ఒక ప్రకటన చేశాడు. దీంతో వారు ఏదో అద్భుతం సాధించినట్లు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. యంగ్‌ సోవియట్‌ చేసిన ఆ డిక్లరేషన్‌ లోని అంశాలను కొంచెం కూడా పరిశీలించినట్టు లేదు. మొదటి ప్రపంచ యుద్ధం ముగియడానికి రెండేళ్ల ముందు అంటే 2016 జూన్‌23న (బ్రిటిష్‌ విదేశాంగ మంత్రి), జార్జి పికోట్‌ (ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి) ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల రూపకల్పనలో అప్పటి రష్యన్‌ జార్‌ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి సెర్గీ జెజనొవ్‌ పాల్గొని, నిర్దిష్టంగా కొన్ని అంశాలను వాటిలో పొందుపరిచారు. ఆ ఒప్పందం కుదిరిన ఒక ఏడాది తరువాత బాల్ఫోర్‌ డిక్లరేషన్‌ వచ్చింది. ఒట్టోమన్‌ సుల్తాన్‌ వలస ప్రాంతాల పంపకానికి సంబంధించి ఒక మ్యాపును అత్యున్నత సంకీర్ణ మండలి (సుప్రీం అలైడ్‌ కౌన్సిల్‌) రూపొందించింది. టర్కీతో సయోధ్య కుదుర్చుకునే విషయమై మిత్రపక్షాలు 1920 ఏప్రిల్‌ రెండవ పక్షంలో ఇటలీలోని శాన్‌ రెమో సిటీలో కూర్చొని చర్చించాయి. దీనికి నెల రోజుల ముందు జరిగిన సిరియా సాధారణ సమావేశం స్వతంత్ర సిరియాను ప్రకటించింది. యువరాజు ఫైజల్‌ను దానికి రాజుగా ఉండాలని కోరింది. 'ఐరోపా రోగి' గా పిలువబడిన ఒట్టోమన్‌ సామ్రాజ్య వారసత్వ విభజనకు సత్వరం ఆమోదం తెలపాలంటే ఈ ఏర్పాటు తప్పనిసరి అయింది. శాన్‌ రెమో సమావేశం నిర్ణయం మేరకు ఇరాక్‌, ఈజిప్టు, జోర్డాన్‌లు బ్రిటన్‌ అజమాయిషీ కిందకు వెళ్లాయి. బాల్ఫోర్‌ డిక్లరేషన్‌ తరువాత పాలస్తీనాపైన దానికి పెత్తనం లభించింది.బాల్ఫోర్‌ డిక్లరేషన్‌లో అంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలను కలిపేశారు. దీని ప్రకారం సిరియా, లెబనాన్‌లు ఫ్రాన్స్‌ అధీనం కిందికి, లిబియా ఇటలీ అధీనంలోకి వెళ్లాయి.
నిర్ణయం చేసినంత మాత్రాన చాలదు. దీనికి 'అక్ష రాజ్యాలు' ప్రత్యేకించి జర్మనీ నుంచి లిఖిత పూర్వక ఆమోదం కూడా దీనికి అవసరమైంది. దీని కోసం 1920 ఆగస్టు 10న పారిస్‌ శివార్లలోని సెవ్రిస్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. .యుద్ధంలో ఓడిపోయిన దేశాలతోబాటు అమెరికా, రష్యాలను మినహాయించారు. రష్యాను పిలవకపోవడానికి కారణం బ్రెస్ట్‌ లితోవ్‌స్కీ ఒప్పందంపై అది సంతకం చేసింది. అయితే రష్యా యుద్ధంలో పాల్గొనడంతో ఆ ఒప్పందం ముగిసినట్లైంది. మొత్తం మీద ఆ సమావేశంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేశారు. పైన పేర్కొన్న దేశాలు దానిపై సంకతం చేశాయి. ఒట్టోమన్‌ సామ్రాజ్యం నుంచి ఈ సమావేశానికి ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ ఆ ఒప్పందాన్ని ధ్రువీకరించింది. తుర్కు యేతరులు ఉండే లెవాంట్‌, మేగ్రెబ్‌ ప్రాంతాలను ఆర్మేనియాకు వదులుకుంటున్నట్లు ప్రకటించింది.
సెవ్రిస్‌ ఒప్పందం ప్రకారం ట్రిపోలి నుంచి పాలస్తీనా వరకు గల సరిహద్దు పరిధిలో ప్రాంతాలకు మరో నాలుగు జిల్లాలు కలుపుకుని గ్రేటర్‌ లెబనాన్‌ ఏర్పాటైంది. నేడు ఈ ఒప్పందం ఫ్రెంచ్‌ వారు, తర్కులు తిరిగి తమ ఇళ్లకు, లిబియాకు వచ్చేందుకు అనుమతిస్తున్నది. ఇది సహజ వాయువు, చమురు వనరుల కోసం పోట్లాడుకుంటున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
లిబియా జాతీయ ఒడంబడిక ప్రభుత్వంతో ఆర్థిక భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నాక టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తయీప్‌ ఎర్డోగన్‌ మాట్లాడుతూ, సెవ్రిస్‌ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తానన్నారు. సైప్రస్‌ వైపు సైనిక దళాలను మోహరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మధ్య ప్య్రాచ్య ప్రాంతంలో చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీయడం, వారి నిల్వల్లో వాటా పొందే హక్కు టర్కీకి ఉందన్నారు. ఈ క్రమంలో టర్కీకి ఫ్రాన్స్‌ నుంచి గట్టి సవాల్‌ ఎదురైంది. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ టర్కీకి కొెన్ని హద్దులు గీచి దీనిని దాటరాదన్నారు. ఈ వివాదాల నడుమనే పాలస్తీనా సమస్య ముందుకొచ్చింది. యూదు దురహంకార ఇజ్రాయిల్‌ ప్రభుత్వం వెస్ట్‌బ్యాంక్‌లో మరి కొన్ని కొత్త ప్రాంతాలను తనలో బలవంతంగా విలీనం చేసుకునేందుకు యత్నిస్తున్నది. ఈ మేరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో అది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి విధానాలు మళ్లీ తెరపైకి వస్తుండడం, ప్రపంచానికి, అరబ్‌ ప్రపంచానికి మధ్య విభజన తీసుకొచ్చే యత్నాలు మళ్లీ జోరందుకుంటున్న ఈ సంఘర్షణాత్మక పరిస్థితుల్లో అత్యంత బలహీనమైన లింకు లెబనాన్‌. అక్కడి మత ఛాందస వ్యవస్థ దేశంలో పెద్దయెత్తున పేరుకుపోయిన సమస్యలను, సంక్షోభాన్ని పరిష్కరించలేని అసమర్థ నిర్వాకం కూడా దీనికి తోడైంది. కొన ఊపిరితో ఉన్న ఈ పరిస్థితిలో సైతం లెబనాన్‌ ఇంకా ఇలాగైనా నిలబడి ఉన్నదంటే అది అక్కడి కోటా వ్యవస్థ ఫలితమేననాలి. ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని సరిగానే గుర్తించినప్పటికీ, దీనికి ప్రత్యామ్నాయాన్ని చూపడంలో అవి విఫలమవుతున్నాయి.
ఎన్‌జివోల ఉచ్చు లోంచి రాడికల్‌ శక్తులు బయటపడి, సామాజిక మార్పుకోసం నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించుకుని, దానిని ఆచరణలో పెట్టే పని ఎంత త్వరంగా చేపడతారన్నదానిపైనే ఇది ఆధారపడి ఉందన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఈ పని వెంటనే జరగాల్సిన అవసరముంది. వివిధ పక్షాలు తమలో తాము కలహించుకోవడం వల్ల అనివార్యంగా అది మాతృ భూమి విచ్ఛిన్నానికి దారి తీస్తుంది.
- మేరీ నసీఫ్‌ దేబ్స్‌(రచయిత లెబనీస్‌ కమ్యూనిస్టు పార్టీ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి)