ప్రజాశక్తి-విజయవాడ
రైతులు తమ పంటలను కన్నబిడ్డల వలె సంరక్షించుకోవాలని సామూహిక ఎలుకల నివారణలో ప్రతి రైతు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ఎస్ డిల్లీరావు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో జిల్లాలో చేపట్టిన సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నున్న వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన సామూహిక ఎలుకల నివారణ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు చేపట్టిన పంటలను కన్నబిడ్డలవలె సంరక్షించుకు న్నప్పుడే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారన్నారు. ముఖ్యంగా వరి పంటలో చీడపీడల తోపాటు ఎలుకల కారణంగా అధిక నష్టాన్ని సరిచూడవలసి వస్తుందన్నారు. వరి పంటను చేపట్టిన రైతాంగం పంట పొలాల్లో ఎలుకల నుండి పంటను సంరక్షించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికి రైతులందరు సామూహికంగాఒకే రోజు ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టిన్నప్పుడు ఎలుకలను సమూలంగా నివారించవచ్చునన్నారు. నారుమడి నాటి నుండి పంట చేతికి వచ్చేవరకు ఎలుకల నుండి పంటలను రక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు బ్రోమోడయోలిన్ మందును రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైతుల సమక్షంలో వ్యవసాయ శాఖ సిబ్బందితో ఎలుకల మందు కలిపే విధానన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు నివారణ మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి యం విజయ భారతి, సహాయ వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి రంగనాద్బాబు, యంపిపి సిహెచ్ ప్రసన్నకుమారి, జడ్పిటిసి ఎస్ సువర్ణ రాజు సర్ఫంచ్ కె సరళ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వై నాగిరెడ్డి, యంపిడివో బి. భార్గవి తహాశీల్థార్ శ్రీనివాస్ నాయక్, స్థానిక నాయుకులు, రైతులు పాల్గొన్నారు.










