Dec 06,2022 22:40

ప్రజాశక్తి - ఏలూరు
          సమాజంలో అన్ని తరగతుల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్‌ జీవితం ఆచరణీయమని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. అంబేద్కర్‌ వర్థంతిని దేశవ్యాప్తంగా మహాపరినిర్వాన్‌ దివాస్‌గా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరు పాత బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ కాంస్య విగ్రహానికి కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య సాధికారతకు అవసరమైన అమూల్య రాజ్యంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతిలో మనవంతుకర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు అందించిన స్పూర్తితో సామాజిక సేవగా సంపూర్ణ విద్యావ్యాప్తికోసం అందరూ కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్‌ మూర్తి, సోషల్‌ వెల్పేర్‌ జెడి ఎస్‌.మధుసూదనరావు, డిఆర్‌డిఎ పీడీ ఆర్‌.విజయరాజు, జెడ్‌పి సిఇఒ కెవిఆర్‌.రవికుమార్‌, డిఎంహెచ్‌ఒ బిఆర్‌.రవి, ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచల కిషోర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండవల్లి: రాజ్యాంగం ద్వారా అన్ని సామాజిక తరగతులకు సమన్యాయం కల్పించిన మహోన్నతవ్యక్తి అంబేద్కర్‌ అని వైసిపి మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అంబేద్కర్‌ వర్థంతిని పురస్కరించుకుని ప్రధాన సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ వ్యక్తి కాదని మహాశక్తి అని అన్నారు. రాజ్యాంగం ద్వారా సమానత్వంతో పాటు, దేశ ప్రజలకు ఆత్మగౌరవం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌.భాస్కరరావు, టెంటు అప్పారావు, జై భీమ్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ వట్టిప్రోలు సుధీర్‌, జేసుదాసు, గురు రమేష్‌, గోరింక గాంధీ, మార్కు రాజు, దాసరియోహాన్‌ రాజు పగుళ్లు, అభిస పాల్గొన్నారు.
చింతలపూడి : అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే నేడు దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయని ఎంపిపి బి.రాంబాబు, నగరపంచాయతీ కమిషనర్‌ ఎన్‌.రాంబాబు, ఎంపిడిఒ మణికుమారి, సొసైటీ ఛైర్మన్‌ ఆత్కూరి సుబ్బారావు, ఎయిమ్‌ జిల్లా నాయకులు కాకర్ల సత్యం అన్నారు. చింతలపూడి పట్టణంలో ఎయిమ్‌ ఆధ్వర్యాన అంబేద్కర్‌ వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం జ్యోతి, సొసైటీ ఛైర్మన్‌ సుబ్బారావు, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ ఏలియ, ముత్తెశ్వరరావు, భాను కుమార్‌, నత్తా వెంకటేశ్వరరావు, రామారావు పండు, జైపాల్‌, దారా పేర్రాజు పాల్గొన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగు, వెంపా కృష్ణ పాల్గొన్నారు.
దెందులూరు : అంబేద్కర్‌ వర్థంతిని మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు. మంగళవారం ఆయా గ్రామాల్లో అంబేద్కర్‌ యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహాలకు ఎంపిపి, జెడ్పిటిసి సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని పలు పాఠశాలల్లో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జీవిత చరిత్రను విద్యార్థులకు బోదించారు.
ఏలూరు అర్బన్‌:రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్థంతిని సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.బెన్నీ, మాజీ ఎంఎల్‌సి ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టారు, డి.శిరీష, రెడ్‌ క్రాస్‌ కో ఆర్డినేటర్లు వి.నాగరాజు, కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ వద్ద ఒక్కరోజు దీక్ష : రాజ్యాంగంలోని సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించి అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ స్వరూపాన్ని మార్చివేసే కుట్ర జరుగుతోందని రాజ్యాంగ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌, రిటైర్డ్‌ ఎఎస్‌ఐ పాకా ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆయన ఒక రోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ పరివార్‌తో కుమ్మక్కై సొంత అజెండాతో రాజ్యాంగాన్ని మార్చాలని కుయుక్తులు పన్నుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌జిఒ సంఘం జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ హరినాథ్‌, శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి నాయకులు పొలిమేర హరికష్ణ, రాజ్యాంగ పరిరక్షణ సమితి కో కన్వీనర్‌ పెదపాటి రామకృష్ణ పాల్గొన్నారు.
స్థానిక మూడో డివిజన్‌లో అంబేద్కర్‌ వర్థంతిని టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ ఆధ్వర్యంలో పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు మోజేష్‌ పాల్గొన్నారు.
గణపవరం : అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) అన్నారు. అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా స్థానిక మార్కెట్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గణపవరం సర్పంచి మోర అలంకారం, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు సలాది రత్నకుమారి, వైసిపి నాయకులు శెట్టి రాజా, రొంగల శ్రీను, తోట శ్రీను, గాజుల వెంకటేశ్వరరావు, దళిత నాయకులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : అంబేద్కర్‌ ఆశయాన్ని నెరవేర్చాలని ఎంపిపి గంజిమాల రామారావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కృష్ణప్రసాద్‌, ఇఒపిఆర్‌డి జ్యోతి పాల్గొన్నారు. స్థానిక పంచాయతీరాజ్‌ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి అంబేద్కర్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మండలంలోని రాజవరంలో అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో, గవరవరంలో అంబేద్కర్‌ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్థంతిని నిర్వహించారు.
ఆదర్శప్రాయులు అంబేద్కర్‌ అని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. అంబేద్కర్‌ వర్థంతిని గవరవరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన సమావేశంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు, మండల కన్వీనర్‌ గొడ్డాటి నాగేశ్వరరావు, మద్దు గోపి, మట్టా సత్తిపండు, మారిశెట్టి శ్రీను, రొక్కాల నాగరాజు, ఆనంద మాస్టారు, నాని పాల్గొన్నారు.
గణపవరం : రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని కెవిపిఎస్‌ మండల కార్యదర్శి చిన్నం చిన్ననాగేశ్వరరావు అన్నారు. అర్థవరంలో అంబేద్కర్‌ వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిన్‌, బద్రి, అంబేద్కర్‌ ఇండియన్‌ మిషన్‌ నాయకులు అశోక్‌, గాతల శివాజీ, గూడ సువర్ణరాజు, కప్పల ఆనందరావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : అంబేద్కర్‌ వర్థతిని స్థానిక సుందరయ్య భవనం వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ అవమానాలు, వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్‌ సకల జనుల కోసం రాజ్యాంగం రచించారన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్యత పెరుగుతుంటే బాబ్రీ మసీద్‌ కూల్చి లౌకికతత్వాన్ని దెబ్బతీశారని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, పి.కిషోర్‌, ఎం.నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు పి.రామకృష్ణ, ఎం.జీవరత్నం, డివైఎఫ్‌ఐ నాయకులు మాబు సుభాని పాల్గొన్నారు.
అంబేద్కర్‌ ఆశయాలు సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని డాంగే నగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షులు కె.లక్ష్మణరావు అన్నారు. అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సచివాలయ అడ్మిన్‌ చిట్టిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ విఆర్‌ఒ శ్రీరాములు, డాంగే నగర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగ, గౌరవ అధ్యక్షులు ప్రభాకర్‌రావు, కార్యదర్శి ఎస్‌కె.ఆసిఫ్‌, సభ్యులు అప్పారావు, వెంకటేశ్వరరావు, నాగేంద్ర పాల్గొన్నారు.
స్థానిక ప్రియదర్శిని కళాశాలలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు పంతగాని వెంకన్న, కెఎస్‌.శంకర్‌రావు, రమణారావు, నాగ కుమార్‌, కడలి గాంధీ, నాగసూరి, బాల సుబ్రహ్మణ్యం, కృష్ణ, సినీ డైరెక్టర్‌ ప్రసాదరాజును మీడియా మిత్రులు ఘనంగా సన్మానించారు.
చింతలపూడి : దళిత బహుజనులకు రిజర్వేషన్లు కల్పించాలని మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ కార్యదర్శి యం.సూర్యకుమార్‌ అన్నారు. అంబేద్కర్‌ వర్థంతి స్థానిక చైతన్య భారతి కాలేజీలో మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జి.ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ వర్థంతి రోజున ఆయన్ను తలచుకోవడం అత్యవసరమని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.సత్యనారాయణ పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : మండలంలో అంబేద్కర్‌ వర్థంతిని నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో గెడ్డం ఎలీషా అధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దర్భగూడెం పంచాయతీ లక్ష్మీపురంలో అంబేద్కర్‌ యూత్‌ అధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీలుగుమిల్లి సెంటర్‌లోని విగ్రహనికి అంబేద్కర్‌ యూత్‌ అధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ సందీప్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రమణ,వి అర్‌ ఓ లు, భాష,మాధురి, శాంతి అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.
టి.నరసాపురం : అంబేద్కర్‌ వర్థంతిని పురస్కరించుకుని మండలంలోని కేతవరంలో సర్పంచి తడికలపూడి శివమాధవి కిషోర్‌ ఆధ్వర్యంలో పలుచోట్ల అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులుర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపిటిసి సభ్యులు రాంబాబు, టి.వీరవెంకయ్య, యు.ప్రసాద్‌బాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ముదినేపల్లి : స్థానిక బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వైసిపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ గంటా సంధ్య, ఎం.ఏసుబాబు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్‌: అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఫారెస్ట్‌ డైరెక్టర్‌ పల్లెం ప్రసాద్‌ అన్నారు. అంబేద్కర్‌ వర్థంతిని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నూకపెయ్యి సుధీర్‌ బాబు, రిటైర్డ్‌ జెఆర్‌ఎస్‌ అధికారి చాగంటి సంజీవ్‌, నాయకులు నేతల రమేష్‌ బాబు, జక్కుల బెనర్జీ, మెండెం సంతోష్‌, పేరం రాజు, మెండెం ఆనంద్‌, కిషోర్‌ పాల్గొన్నారు.
కైకలూరు రూరల్‌ : మండలంలో అంబేద్కర్‌ వర్థంతిని నిర్వహించారు. కైకలూరులోని తాలూకా సెంటర్లలో ఆయన విగ్రహానికి ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్‌ దండే పుష్పలత, ఎంపిపి అడవి కృష్ణ, మాల మహాసేన నాయకులు, దళిత సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ ఎంఎల్‌ఎ జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కైకలూరు, వరహాపట్నం, దొడ్డిపట్ల, పల్లేవాడ తదితర గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలిదిండి : భాస్కరరావుపేటలో కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మంగం సురేష్‌, సర్పంచి గద్దే ఆనంద్‌, మట్టగుంటలో ఎస్‌సి సెల్‌ నాయకులు బళ్ల రాజు, కొండంగిలో ఎస్‌సి సంఘం నాయకులు బోడిగడ్డ కిషోర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేషపు మహంకాళరావు, జక్కుల మహేష్‌, రైతు సంఘం నాయకులు వీరవల్లి భాస్కరరావు, కుడిపూడి శ్రీను, కెవిపిఎస్‌ నాయకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.