రాయచోటి : గడపగడపకు మన ప్రభుత్వంలో వచ్చిన పెండింగ్ పనులను పూర్తి చేయాని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గ్రామ వార్డు సచివాలయాలు, స్పందన, రీ సర్వే, హౌసింగ్, ఎన్నికలు, తదితర అంశాల మీద జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కార్డు మ్యాపింగ్లో ఉన్న లోపాలను సవరించాలని, సంపూర్ణ పోషణ కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. రీ సర్వేకు సంబంధించి, ఎస్ఎల్ఏ దాటినవి ఉండకూడదని, ఓటీఎస్, భూహక్కు భూ రక్షా మీద దష్టి సారించాలని సూచించారు. ఎన్నికల గురించి సమీక్షిస్తూ కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలలో చెల్లని ఓటర్ కార్డులు చాలా బయటపడ్డాయని, అటువంటివి మన జిల్లాలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని, వాటిని మళ్లీ రీఓపెన్ చేయకుండా ఉండేలా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు . కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










