Apr 06,2023 21:10

మైదుకూరు డిఎస్‌పి వంశీధర్‌గౌడ్‌ వెల్లడి


 బ్రహ్మంగారిమఠం : మండలంలో పదవ తరగతి మొదటి పరీక్ష తెలుగు జవాబు పత్రం లీకేజీకి కారణమైన ఆరుగురిని అరెస్టు చేశామని మైదుకూరు డిఎస్‌పి వంశీధర్‌ గౌడ్‌, మైదుకూరు రూరల్‌ సిఐ నరేందర్‌రెడ్డి, ఎస్‌ఐ విద్యాసాగర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని అంబవరానికి చెందిన మేకల గంగాధర్‌ అనే వ్యక్తిని తెలుగు జవాబు పత్రం కేసులో అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. విద్యుత్‌ ఆఫీస్‌లో లైన్‌ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న రామిరెడ్డి ద్వారా తనకు జిరాక్స్‌ కాపీ వచ్చిందని గంగాధర్‌ చెప్పాడని పేర్కొన్నారు. తన చెల్లెలి కోసం ఒక కాపీ జిరాక్స్‌ ఇవ్వాలని గంగాధర్‌ స్నేహితుడైన సతీష్‌తో కలిసి వెళ్లి బి.మఠంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్‌ వద్దకు వెళ్లి జిరాక్స్‌ కాపీలు తీసుకున్నారన్నారు. జిరాక్స్‌ సెంటర్‌ వద్ద ఉన్న ఓ టివి విలేకరి వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారన్నారు. గంగాధర్‌ చెప్పిన సమాచారం మేరకు రామిరెడ్డ్డిని అదుపులో తీసుకొని విచారించగా తన కుమార్తె పదవ తరగతి పరీక్షలు రాస్తున్నడంతో దీప్తి స్కూల్లో పనిచేసే హిందీ ఉపాధ్యాయుడు నుంచి రెండు మైక్రో జిరాక్స్‌ తెలుగు జవాబు కాపీలను తీసుకున్నాడన్నారు. రామిరెడ్డి సమాచారం మేరకు స్కూల్‌ వద్దకు వెళ్లి ఫిజిక్స్‌ టీచర్‌ సుబ్రహ్మణ్యం, తెలుగు టీచర్‌ రామాంజనేయులు, హిందీ టీచర్‌ బాలరాజులు అదుపులో తీసుకుని విచారించామన్నారు. బి.కోడూరు మండలంలోని సగిలేరు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు బాలచంద్రుడు ద్వారా తన సమీప బంధువు తెలుగు టీచర్‌ రామాంజనేయులకు వాట్సాప్‌ ద్వారా పంపారని పేర్కొన్నారు. ప్రశ్న పత్రాన్ని ఆ ముగ్గురు టీచర్లు దీప్తి హైస్కూల్‌ కరస్పాండెటర్‌ రమణారెడ్డికి తెలిపారు. రమణారెడ్డి సూచనల మేరకు ముగ్గురు టీచర్లు తెలుగు గైడ్‌లో నుంచి జవాబులు సేకరించి వాటిని మైక్రో జిరాక్స్‌ కాపీలను స్కూల్లోని ప్రింటర్‌ ద్వారా చేసి వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. దీప్తి హైస్కూల్‌లోని కంప్యూటర్‌, జిరాక్స్‌ మిషన్‌ను, మూడు కాపీ పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సగిలేరు గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి విచారణ నిర్వహించామన్నారు. అక్కడ తెలుగు టీచర్‌ చంద్రబాబును విచారించామన్నారు. తమ స్కూలుకు సంబంధించి 62 మంది విద్యార్థులు పరీక్షలు బి.కోడూరు జడ్పీ హైస్కూల్లో పరీక్షలు రాస్తున్నడంతో రూమ్‌ నెంబర్‌-7లో ఉన్న తమ విద్యార్థి ద్వారా ప్రశ్నపత్రం తెల్లకాగితంలో రాసుకున్నామన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మేకల గంగాధర్‌, గంగిరెడ్డి చిన్నరామిరెడ్డి, చిట్టిబోయిన బాలసుబ్రమణ్యం, వనిపెంట రామాంజనేయులు, సగిలి బాలరాజు, పొందిబోయిన చంద్రబాలుడును అరెస్టు చేశామని పేర్కొన్నారు.
- విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డిఎస్‌పి