Jul 24,2021 12:08

న్యూఢిల్లీ : ఎమ్మెల్యే భార్య ను, కారు డ్రైవర్‌ను బోల్తా కొట్టించి కారులో ఉన్న విలువైన బంగారం, నగదు, ఐఫోన్‌, డాక్యుమెంట్లను దొంగలు కాజేశారు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు... కోల్‌కతా, జోరసకో నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వివేక్‌ గుప్తా న్యూఢిల్లీ, లోధి కాలనీలోని ఓ హౌటల్‌లో కొద్ది రోజులుగా ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం వివేక్‌ భార్య కారులో బయటకు వెళ్లారు. 2 గంటల 15 నిముషాల సమయంలో డిఫెన్స్‌ కాలనీ ఫ్లైఓవర్‌ వద్ద కారు వెళుతుండగా... మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు కారును సమీపించి టైరును చూపిస్తూ ఏవో సంజ్ఞలు చేశారు. దీంతో కారు టైరులో ఏదో సమస్య ఉందనుకొని డ్రైవర్‌ కారును ఆపాడు. ఆ తర్వాత మరో మోటారు సైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు కారు బోనోట్‌ను చూపించారు. డ్రైవర్‌ కారు బోనోట్‌ దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. కొద్దిసేపటికి వివేక్‌ భార్య ఉక్కపోతను భరించలేక కారులోంచి బయటకు వచ్చారు. మోటార్‌ సైకిల్‌పై వచ్చి అదును కోసం చూస్తున్న దుండగులు వెంటనే కారులోని రెండు లక్షల రూపాయల నగదు, ఐ ఫోన్‌, గోల్డ్‌ కాయిన్‌, డాక్యుమెంట్లను కాజేశారు. దొంగతనం జరిగిందని గుర్తించిన ఎమ్మెల్యే భార్య పోలీసులను ఆశ్రయించారు. ఇది తక్‌.. తక్‌ గ్యాంగ్‌ పనైయుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.