Jul 24,2021 14:39

దేవీపట్నం (తూర్పు గోదావరి) : గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లోనూ, రాష్ట్రంలోనూ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో దేవీపట్నం పోచమ్మ గండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. ఆలయం గోపురాన్ని వరద నీరు తాకింది. ఆలయంతో పాటు సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది. దీంతో ముంపు గ్రామాలపై తీవ్ర ప్రభావం పడిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.