Apr 25,2023 21:54

ఫొటో : ఏర్పాట్లు పరిశీలిస్తున్న బొమ్మిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి

నేడు బిఎస్‌ఆర్‌ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు ప్రముఖుల హాజరు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : అందరివాడు, ప్రజావైద్యులు, మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్‌ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కాంస్య విగ్రహం ఆవిష్కరణ బుధవారం సాయంత్రం 5 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ జెడ్‌పి చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరై విగ్రహావిష్కరణ చేస్తారన్నారు. బిఎస్‌ఆర్‌ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం అన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ పాలకులు తదితరులు అందరిని సమిష్టి సహకారంతో మున్సిపల్‌ అనుమతి పొంది విగ్రహ ఏర్పాటుకు బి.ఎస్‌.ఆర్‌. సెంటర్‌లో స్థలం గుర్తించామన్నారు. డాక్టర్‌ సుందర రామిరెడ్డి ఆత్మకూరులో కొంతకాలం ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేసే అనంతరం ఆత్మకూరులో సొంతంగా బిఎస్‌ఆర్‌ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఆత్మకూరు పట్టణమే కాకుండా అటు ఉదయగిరి బద్వేల్‌ ప్రాంతాల్లో కూడా ఆయనకు అశేష అభిమానం పొంది ప్రజావైద్యుడిగా ప్రజల మన్ననలు పొందారని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో ప్రవేశించి కొన్ని నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి జిసి కొండయ్యపై విజయం సాధించి తొలిసారిగా శాసనసభ్యులుగా అయ్యారన్నారు. శాసనసభ్యులుగా ఉంటూనే ఆయన వైద్య సేవలు కొనసాగించారని తెలిపారు. ఆయన తుది శ్వాస వరకు ప్రజలకు వైద్యసేవలు అందించారన్నారు. ఆయన శాసనసభ్యునిగా ఎస్‌ఎఫ్‌సి చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఉద్యోగాలు కల్పనలు అనూహ్య ఫలితాలు సాధించి ప్రజాదరణ పొందారన్నారు. ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అతిరథ మహారథులతో ఉన్న సాన్నిహిత్యంతో అనేక పథకాలు ఆత్మకూరు కోసం సాధించారని కొనియాడారు. ఆయనవెంట సుందర్రామిరెడ్డి మనవడు బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌ రెడ్డి, టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రా రెడ్డి, రూరల్‌ మండలం ప్రధాన కార్యదర్శి కేత విజయభాస్కర్‌ రెడ్డి, యువ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు తదితరులున్నారు.